సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ): మైక్రో ఫైనాన్స్ సంస్థ నిర్వహణ పేరుతో రుణాలు పొంది, బ్యాంకులను మోసం చేస్తున్న ఒడిశాకు చెందిన ఓ చీటర్ను సీసీఎస్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. జాయింట్ సీపీ అవినాశ్ మహంతి కథనం ప్రకారం.. ఒడిశాలోని రూర్కేలాలో సంబంధ్ ఫిన్సర్వ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సీఈఓ, ఎండీగా దీపక్ కిండో వ్యవహరించాడు. ఆయన పదవీ కాలంలో దేశ వ్యాప్తంగా బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్ నుంచి రూ. 200 కోట్ల రుణాలు పొంది, వాటిని తిరిగి చెల్లించకుండా చేతులెత్తేశాడు. పలు రాష్ర్టాల్లో అతడిపై కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా, హైదరాబాద్కు చెందిన నాబార్డుకు అనుబంధంగా కొనసాగుతున్న నబ్ సంవృద్ధి ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి ఒడిశాలో మైక్రో ఫైనాన్స్ చేస్తానంటూ 2019 మార్చి నెలలో రూ. 5 కోట్ల రుణం తీసుకున్నాడు. వాయిదాల పద్ధతిలో రూ. 3 కోట్లు మాత్రమే చెల్లించి, మిగతా రుణం చెల్లించకుండా చేతులెత్తేశాడు. రుణం ఇచ్చిన సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ అఫీసర్ గతనెలలో సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ఒడిశాలోని రాజ్గంగ్పూర్లో నిందితుడు దీపక్ కిండోను అరెస్ట్ చేసి, నగరానికి తరలించారు.