కరోనా కలకలం అన్ని రంగాలనూ కలవరపెట్టినట్టే సురప్రియులకు కిక్కు చిక్కులు తెచ్చిపెట్టింది. గ్లాస్మేట్తో చీర్స్ కొట్టందే సిప్ చేయలేని మదిరోపాసకుల పాలిట కరోనా తెచ్చిన వ్యక్తిగత దూరం భరించలేని భారంగా మారింది. దీంతో, అన్ని రంగాలూ తమ పనులు చక్కదిద్దుకోవడానికి ఆన్లైన్ బాటపట్టినట్టే.. పానప్రియులు సైతం ‘మద్య’స్థంగా ఓ వేదికను ఎంచుకున్నారు. అదే సింగిల్ మాల్ట్ అప్రిసియేషన్ క్లబ్ (స్మాక్). దేశదేశాలకు చెందిన వాళ్లు ఈ క్లబ్లో సభ్యులుగా చేరిపోయారు. గ్లాసుల సందడి లేకుండానే వర్చువల్గా చీర్స్ కొడుతున్నారు. ఏకకాలంలో వందలమంది సురార్చన చేస్తున్నారు. కొందరైతే త్రీడి సాంకేతికత సాయంతో ఒకే టేబుల్ పంచుకున్న అనుభూతిని సొంతం చేసుకుంటున్నారు. అలాగని ఇది తాగుబోతుల బ్యాచ్ అనుకోవద్దు. పక్కా ప్రొఫెషనల్ మీటింగ్స్ నిర్వహిస్తూనే, మందుతోపాటు ముందుచూపునూ పంచుకుంటున్నారు. అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు. స్మాక్ నెలకొల్పి దశాబ్దం కావొస్తున్నా.. కరోనా లాక్డౌన్ సమయంలో ఈ క్లబ్ గురించి అందరికీ తెలిసొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4,000 మంది ఇందులో సభ్యులుగా చేరారు. అందరూ కలిసి అడపాదడపా ప్రత్యేక ఈవెంట్లూ నిర్వహిస్తూ కిక్కును షేర్ చేసుకుంటున్నారు.