వేదానికి మంత్రం నేర్పినవాడు, ఉపనిషత్తులకు ఉపాసనా మార్గాన్ని బోధించినవాడు.. ఆది గణపతి. అధర్వవేదానికి అనుబంధమైన గణపతి ఉపనిషత్తు ఏకదంతుడిని వేనోళ్లా కొనియాడుతుంది, గజముఖుడి ఘనతను కీర్తిస్తుంది..
“లం.. బీజాక్షర స్వరూపుడైన గణపతికి నమస్కారం. స్వామీ! నీవే ప్రత్యక్ష తత్వానివి.
కేవల కర్తవు.కేవల భర్తవు.కేవల హర్తవు.సకల జగత్ స్వరూపంగా ఉన్న పరబ్రహ్మవు నీవే.
నిత్యమైన ఆత్మవు కూడా నీవే.నేనెప్పుడూ నిజాన్నే పలుకుతాను. నన్ను రక్షించు. ముందు, వెనక, పైనుంచి, కిందినుంచి.. అన్ని వైపుల నుంచీ నాకు ఏ కష్టమూ రాకుండా కాపాడు.
నీవు వాఙ్మయ, జ్ఞాన, విజ్ఞాన, బ్రహ్మమయ స్వరూపుడివి. సచ్చిదానందుడివి. అద్వితీయుడివి. ప్రత్యక్ష బ్రహ్మవు.చిన్మయుడివి. ఆనందమయుడివి. ఈ సకల ప్రపంచం నీ నుంచే ఆవిర్భవిస్తోంది. నీవల్లనే ఇలా స్థిరంగా ఉంది. చివరికి ఇదంతా నీలోనే లయమై పోతుంది”
“ప్రపంచం మొత్తం నిన్నే నమ్ముకుంది. నీవే భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశానివి. నాలుగు విధాలైన వాక్ స్వరూపానివి. గుణత్రయాలకూ, దేహత్రయాలకూ, కాలత్రయాలకూ అతీతుడివి. మూలాధార చక్రంలో నీవు నిత్యం కొలువుంటావు. శక్తిత్రయ స్వరూపానివి నీవు. యోగులు నిత్యం నిన్నే ధ్యానిస్తూ ఉంటారు. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఇంద్ర, అగ్ని, సూర్య, చంద్ర, భూలోక, భువర్లోక, సువర్లోక స్వరూపానివి నీవు” “వ్రాతపతి, గణపతి, ప్రమథపతి, లంబోదరుడు, ఏకదంతుడు, విఘ్న వినాశకుడు, శివకుమారుడు, వరదమూర్తి అయిన గణేశుడికి నమస్కారం. ఈ గణపతి అధర్వోపనిషత్తును శ్రద్ధగా అధ్యయనం చేసినవాళ్లు బ్రహ్మత్వం పొందుతారు. అన్ని రకాల సుఖాలూ వారికి ప్రాప్తిస్తాయి. ఎలాంటి విఘ్నాలూ వారిని బాధించలేవు. పంచ మహాపాతకాల నుంచి, ఉపపాతకాల నుంచి విముక్తి పొందుతారు. గణపతి ఉప నిషత్తును సాయంత్రం చదివితే ఉదయం చేసిన పాపాలు నశిస్తాయి. ఉదయం చదివితే ముందురోజు రాత్రి చేసిన పాపాలు తొలగి పోతాయి. రోజూ రెండుపూటలా చదివిన వారికి సకల పాపాలూ నశిస్తాయి. దీనిని చదివిన వారు ధర్మ, అర్థ, కామ, మోక్షాలను పొందుతారు. ఈ ఉపనిషత్తును అనర్హులకు బోధించ కూడదు. మహిమాన్వితమైన ఈ గణపతి ఉపనిషత్తును వెయ్యిసార్లు పారాయణ చేస్తే కోరికలు సిద్ధిస్తాయి.
“ఒకే దంతం కలిగినవాడు, నాలుగు హస్తాల్లో పాశ, అంకుశ, వరద, అభయ ముద్రల్ని ధరించినవాడు, మూషిక వాహనుడు, ఎర్రటి వర్ణంతో ప్రకాశించే లంబోదరుడు, చేటలలాంటి చెవులు ఉన్నవాడు, ఎర్రటి వస్ర్తాన్ని ధరించినవాడు, ఎర్రచందనాన్ని శరీరానికి పూసుకున్నవాడు, ఎర్రటి పూలతో పూజలు అందుకునేవాడు, భక్తుల్ని కాపాడేవాడు, భగవంతుడు, జగత్తుకు కారణమైనవాడు, అచ్యుతుడు, సృష్టి ఆరంభంలో జన్మించినవాడు, ప్రకృతీ పురుషుల కన్నా పూర్వుడు అయిన మహాగణపతిని నిత్యమూ ధ్యానించే యోగులు ధన్యులు”
“ఈ ఉపనిషత్తును పఠిస్తూ గణపతిని అభిషేకిస్తే మంచి వక్త అవుతారు. చవితినాడు ఉపవాస దీక్షతో పారాయణ చేస్తే విద్యావంతుడు అవుతాడు. ఇది అధర్వణుడు చెప్పిన మాట. ఈ ఉపనిషత్తు చదువుతూ దూర్వాంకురాలతో (గరిక పోచలతో) గణపతిని పూజించిన వాడు కుబేరుడితో సమానుడు అవుతాడు. దీనిని పఠిస్తూ పేలాలతో (లాజలు) హోమం చేస్తే కోరిన కోరికలు తీరతాయి. ఆజ్యంతో కూడిన సమిధలతో హోమం చేస్తే సర్వాన్నీ పొందుతారు. ఎనిమిది మంది బ్రాహ్మణులతో ఈ ఉపనిషత్తును పఠింప జేస్తూ హోమం చేయిస్తే, చేయించిన వారికి సూర్య వర్చస్సు లభిస్తుంది. ఇది సాధకుడిని మహావిఘ్నాల నుంచి, మహాదోషాల నుంచీ విముక్తుణ్ని చేస్తుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న వాళ్లు సర్వ వేత్తలు అవుతారు”
మోదక ప్రియాయ నమః
విఘ్నాలను తొలగించే దేవుడికి ఎంతో ప్రీతికరమైంది మోదకం. అందుకే, వినాయక చవితి పర్వదినాన రకరకాల మోదక్లను నైవేద్యంగా సమర్పిస్తారు. వీటిని తీపి మోదక్, కేసరి మోదక్, కోవా మోదక్, డ్రైఫ్రూట్ మోదక్.. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా చేస్తారు. మచ్చుకు రెండు ప్రసాదాలు..
కేసరి మోదక్
తయారీ విధానం
స్టవ్మీద కడాయి పెట్టి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, బాగా వేడయ్యాక రవ్వవేసి దోరగా వేయించాలి. బాగా వేగిన రవ్వలో కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా పోస్తూ ఉండలు కాకుండా కలుపుకోవాలి. రవ్వ మిశ్రమం దగ్గరపడుతుండగా చక్కెర వేసి మరో రెండు నిమిషాలు ఉడికించి యాలకుల పొడి, కొద్దిగా నెయ్యి వేసి కలుపుకోవాలి. చివరగా, ఒక టేబుల్ స్పూన్ పాలలో నాన బెట్టిన కుంకుమ పువ్వు కానీ, ఫుడ్ కలర్ కానీ వేసుకుని మరోసారి బాగా కలిపి దింపేయాలి. స్టవ్మీద మరో పాన్ పెట్టి, రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి, తరిగిన డ్రైఫ్రూట్స్ వేసి బాగా వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో ఒక స్పూన్ చక్కెర, కొద్దిగా రవ్వ మిశ్రమం జోడించి ముద్దగా వచ్చేలా కలుపుకోవాలి. ఇప్పుడు, మోదక్ అచ్చుకు నెయ్యి రాసి చుట్టూ రవ్వ మిశ్రమం ఒత్తుకుని మధ్యలో డ్రైఫ్రూట్స్ మిశ్రమం పెట్టి, కింద రవ్వ మిశ్రమంతో మూసేసి.. మెల్లగా అచ్చులోనుంచి తీసుకుని ప్లేట్లో పెట్టుకుంటే చాలు. కేసరి మోదక్ సిద్ధం.
ఫ్రైడ్ మోదక్
కావలసిన పదార్థాలు
గోధుమ పిండి: ఒక కప్పు, పచ్చికొబ్బరి తురుము: ఒక కప్పు, చక్కెర: అరకప్పు, పాలు: పావుకప్పు, యాలకుల పొడి: అర టీస్పూన్, నెయ్యి: రెండు టేబుల్స్పూన్లు, డ్రైఫ్రూట్స్: పావుకప్పు, ఉప్పు: చిటికెడు, నూనె: వేయించడానికి సరిపడా.
తయారీ విధానం
ముందుగా గోధుమ పిండిలో చిటికెడు ఉప్పు, ఒక టేబుల్స్పూన్ గోరువెచ్చని నూనె వేసి తగినన్ని నీళ్లుపోసి చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్మీద పాన్పెట్టి, నెయ్యి వేసి వేడయ్యాక తరిగిన డ్రైఫ్రూట్స్, పచ్చికొబ్బరి తురుము, చక్కెర, పాలు వేసి బాగా కలుపుతూ దగ్గర పడనివ్వాలి. తర్వాత యాలకులపొడి వేసి దింపి చల్లారనివ్వాలి. ఇప్పుడు గోధుమ పిండి మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని చిన్న చపాతీలా ఒత్తుకుని మధ్యలో కొబ్బరి మిశ్రమాన్ని పెట్టి మోదక్లా చుట్టూ మలుచుకోవాలి. స్టవ్పై కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి మోదక్లను గోధుమరంగు వచ్చే వరకు వేయించాలి. వీటిని ఆవిరిపై కూడా ఉడికించుకోవచ్చు.