‘గోమయ వసతే లక్ష్మీ..’ అంటే గోమయంలో సాక్షాత్తూ లక్ష్మీదేవి కొలువు ఉంటుందని అర్థం. పూజాదికాల్లో, ఔషధాల్లో గోమయం (ఆవు పేడ) ప్రాధాన్యం తెలిసిందే! ఇదే గోమయంతో గౌరీ తనయుణ్ని తీర్చిదిద్దుతున్నారు క్లిమామ్ సంస్థ వ్యవస్థాపకురాలు అల్లోల దివ్యారెడ్డి. ప్రకృతి పండుగను పర్యావరణ హితంగా నిర్వహించాలనే సంకల్పంతో ఐదేండ్లుగా గోమయ గణపయ్య ప్రతిమలను తయారు చేయించి, వాడవాడలా పంచుతున్నారామె. క్లిమామ్ గోశాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోమయ వినాయకులను తయారు చేయాలని 2016లో నిర్ణయించారు దివ్యారెడ్డి. నాసిక్లోని 17వ శతాబ్దంనాటి ఆలయంలో గోమయ ఆంజనేయస్వామి విగ్రహం స్ఫూర్తితో ఆవు పేడతో గణపతి విగ్రహాలు తయారు చేయాలని భావించారు. 2017 నుంచీ ఏటా లక్షలాది రూపాయలు వెచ్చిస్తూ గోమయ మూర్తులను పంపిణీ చేస్తున్నారు.
ఒక అడుగు నుంచి ఆరు అడుగుల ఎత్తున్న విగ్రహాలను వివిధ రూపాల్లో రూపొందిస్తున్నారు. పసుపు, నిమ్మ ఆకుల ముద్ద, మట్టి, చింతగింజల పొడిని గోమయంలో కలిపి, ఈ మిశ్రమంతో వినాయక ప్రతిమలు చేస్తున్నారు. ఏటా వినాయక చవితికి రెండు నెలల ముందు నుంచీ ఈ మహాకార్యం మొదలవుతుంది. ప్రకృతి సిద్ధమైన వస్తువులతో రూపొందిన ఈ విగ్రహాలను కొలువుదీర్చడానికి మంటపాల నిర్వాహకులూ ఆసక్తి చూపుతున్నారు. పైగా ఈ వినాయకులను నిమజ్జనం చేయడం వల్ల జలజీవాలకు ఆహారం లభించడంతోపాటు, ఇందులోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా నీటిని శుద్ధి చేస్తుంది. ఇంట్లో నిమజ్జనం చేసి ఆ నీటిని మొక్కలకు పోస్తే మంచి ఎరువుగానూ ఉపయోగపడుతుంది. ఈ ఏడాది కూడా ఎప్పటిలాగే మంటపాలు, దేవాలయాలు, విద్యాలయాలు, కార్యాలయాలతోపాటు గృహ యజమానులకు గోమయ వినాయకులను ఉచితంగా అందించారు.
‘భారతీయ
సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపై ఉంది. రసాయనాలు వాడి వినాయకుల ప్రతిమలను తయారు చేయడం వల్ల పర్యావరణానికి కీడు కలుగుతుంది. ప్రకృతిని కాపాడే లక్ష్యంతో ఏటా గోమయ, మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్నా. ప్రజలు, మంటపాల నిర్వాహకుల నుంచి మంచి స్పందన వస్తున్నది’
అల్లోల దివ్యారెడ్డి
రాంపెల్లి నరేందర్