దసరాతో ముగిసే నవరాత్రులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అమ్మవారికి సంబంధించిన సంప్రదాయ పండుగ ఇది. నవరాత్రులు లోకంలోని చెడును, విశృంఖలత్వాన్ని నిర్మూలిస్తాయి. అలాగే, జీవితంలో మన శ్రేయస్సుకి దోహదపడే వస్తువులు, విషయాల పట్ల కృతజ్ఞత తెలియజేసేందుకు దోహదం చేస్తాయి. నవరాత్రులను.. మూడు ప్రాథమిక లక్షణాలైన తామస, రజస, సత్వ గుణాలకు అనుగుణంగా వర్గీకరించారు. మొదటి మూడు రోజులు తామసికమైనవి, వాటికి ప్రతీకలు తీవ్రమైన దుర్గ, కాళి దేవతలు. తరువాతి మూడు రోజులు లక్ష్మికి సంబంధించినవి. కోమలమైనదే కానీ, ధన, వస్తు, కనక, వాహనాలకు ఆధారమైన దేవి. ఆఖరి మూడు రోజులు సరస్వతికి సంబంధించినవి. సత్వగుణ తేజస్సుతో అలరారే వాగ్దేవి మనలో జ్ఞానాన్ని వికసింపజేస్తుంది. నవరాత్రుల దివ్యత్వాన్ని పుణికి పుచ్చుకున్న పదో రోజు విజయ దశమి. అంటే నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని పై మూడు గుణాలను జయించారని అర్థం.
ఈ తామస, రాజస, సత్వ గుణాలలో వేటిని ఎంత వృద్ధి చేసుకుంటున్నారనే దానిపైనే జీవితం ఆధారపడి ఉంటుంది. తామసంగా వ్యవహరిస్తే.. శక్తిమంతంగా తయారవ్వొచ్చు. రాజసంగా వ్యవహరిస్తే జీవితం మరోలా ఉంటుంది. సత్వ గుణాన్ని పెంపొందించుకుంటే సాత్వికశక్తిని పొందుతారు. కానీ, వీటన్నిటినీ అధిగమించి ముందుకు వెళ్తే.. అప్పుడది శక్తికి చెందింది కాదు, ముక్తికి సంబంధించింది అవుతుంది. నవ రాత్రుల తరువాత పదవది, అంటే ఆఖరుది విజయదశమి- అంటే మీరు వాటిలో దేనికీ లొంగి పోకుండా, వాటిని దాటి వెళ్ళారు. మీరు వాటి అన్నిటిలోనూ పాల్గొన్నారు కానీ మీరు ఆ గుణాలను మీవిగా చేసుకోలేదు. మీరు వాటిని జయించారు. అదే విజయదశమి, జయం పొందిన రోజు.
ప్రేమాశీస్సులతో..
సద్గురు