ప్రస్తుతం కొవిడ్ టీకా పద్దెనిమిదేండ్లు నిండిన వారికంతా అందుబాటులోకి వచ్చింది. అయినా, ప్రజల్లో అపోహలు అలాగే ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీలు, ఈ విషయంలో అర్థంలేని భయాలు పెంచుకొంటున్నారు. నిజానికి, మహిళల భాగస్వామ్యంతోనే ఈ మహమ్మారిని అంతమొందించగలం. స్త్రీలను కొవిడ్ నుంచి రక్షిస్తే.. వారు తమ పిల్లలను, కుటుంబాన్ని కాపాడుకుంటారు. మాస్క్, పరిశుభ్రత, భౌతికదూరం.. ఈ మూడూ కాకుండా అతి ముఖ్యమైన నాలుగో మార్గం – వ్యాక్సిన్.
పాలిచ్చే తల్లులు
టీకావల్ల తల్లీపిల్లలిద్దరికీ లాభమే. రెండు డోసులు తీసుకొన్న తల్లికి తగిన రక్షణ లభిస్తుంది. తల్లిని కొవిడ్నుంచి రక్షించడం వల్ల పిల్లలకు ఆ వ్యాధి సోకకుండా నివారించవచ్చు. తల్లిపాల ద్వారా వచ్చే యాంటీబాడీలు శిశువులకు రక్షణ వలయంలా నిలుస్తాయి. కొవిడ్ టీకాను కాన్పు తర్వాత ఎప్పుడైనా ఇవ్వవచ్చు.
గర్భిణులు
గర్భిణుల్లో సహజంగానే రోగ నిరోధక శక్తి తక్కువ. ఫలితంగా, కొవిడ్ సోకితే మాత్రం తీవ్రరూపం దాల్చుతుంది. దీనివల్ల అబార్షన్లు, గర్భస్థ శిశు మరణాలు, బరువు తక్కువ పిల్లలు పుట్టడం.. తదితర విపరిణామాలు సంభ విస్తాయి. పిండం పెరుగుతున్నకొద్దీ గర్భసంచి పరిమాణం పెరిగి, ఊపిరితిత్తులపై ఒత్తిడి కలుగుతుంది. వాటి వ్యాకోచశక్తి తగ్గి ఆయాసం వస్తుంది. గర్భంతోపాటు సహజంగా పెరిగే బరువు, అధిక రక్తపోటుకు అదనంగా.. రక్తంలో గడ్డకట్టే స్వభావం పెరుగుతుంది. దీనివల్ల ఇతరులకన్నా గర్భిణులపై కొవిడ్ ప్రభావం ఎక్కువే. టీకా వేసుకోవడం వల్ల తల్లికి, పిండానికి ఏ విధమైన హానీ కలుగదు. గర్భం ప్రారంభ దశనుంచి ఎప్పుడైనా టీకా ఇవ్వవచ్చు. రక్తహీనత, మధుమేహం, రక్తపోటు ఉన్నవారికి కూడా డాక్టర్ల పర్యవేక్షణలో టీకా ఇవ్వవచ్చు.
డాక్టర్ కర్రా రమేష్రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు