‘కరోనా వ్యాక్సిన్ వేయించుకోండమ్మా!’ అంటే, విద్యావంతులైన నగర మహిళలే ‘వామ్మో వ్యాక్సినా?’ అంటూ అపోహలు, భయాలతో ఆమడదూరం వెళ్తున్నారు. ఆధునిక నాగరికతకు బహుదూరం బతికే ఆదివాసీ మహిళలు మాత్రం కరోనా వ్యాక్సిన్ తీసుకోవడంతోపాటు, తోటివారికి వ్యాక్సిన్ ప్రాధాన్యాన్నీ వివరిస్తున్నారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లోని బస్తర్, మాండ్ల జిల్లాల గిరిజనులు వందశాతం వ్యాక్సినేషన్ దిశగా అడుగులు వేస్తున్నారు. అంతేకాదు, తామే చొరవగా తోటి మహిళలను వ్యాక్సిన్ కేంద్రాలకు తీసుకెళ్తున్నారు. మార్కెట్లలో, సంతల్లో, పాల కేంద్రాలవద్ద స్థానిక కళారూపాల సాయంతో టీకా ప్రయోజనాలపట్ల అవగాహన కల్పిస్తున్నారు. ఈ ప్రయత్నాన్ని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ముండా అభినందించారు.