అవసరం ఉన్నచోటే ఆవిష్కరణలు పుట్టుకొస్తాయి. కాబట్టే, హైదరాబాద్లో త్వరలోనే ప్రారంభంకాబోతున్నది.. మీట్ బట్చరీ అకాడమీ. అవును, మాంసాన్ని ఎలా ముక్కలుగా కొట్టాలి, మాంసం నాణ్యతను ఎలా గుర్తించాలి, కూర వృథా కాకుండా ఎలా తరగాలి, ఎలా నిలువ చేయాలి?.. మొదలైన అంశాల్లో శిక్షణ ఇవ్వడమే అకాడమీ ముఖ్య ఉద్దేశం. బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థి మంచాల వంశీరాజ్ స్థాపించిన ప్రొటీన్స్ హైజీనిక్ నాన్వెజ్ మార్ట్ అనే స్టార్టప్ నేతృత్వంలో ఈ బడి నడుస్తుంది. మూడు నెలల్లో, ఐదొందలమందిని మటన్ మస్తాన్లుగా తీర్చిదిద్దడం వంశీ లక్ష్యం. ట్రెయినింగ్ తర్వాత తమ కంపెనీలోనే వారికి ఉద్యోగమూ ఇస్తారట. వంశీ తన వ్యాపారానికి హైదరాబాద్ను కేంద్రంగా ఎంచుకోవడం వెనుకా ఓ వ్యూహం ఉంది. మన సిటీ నాన్వెజ్ రాజధాని! ఇక్కడ ఏటా రూ. మూడున్నరవేల కోట్ల మాంసం వ్యాపారం జరుగుతుందని అంచనా. ‘ప్రతి నాన్వెజ్ ప్రియుడూ మాకు ప్రియాతిప్రియమైన కస్టమరే’ అంటారు వంశీ!