కొడుకు పుట్టాడంటే స్వీట్లు పంచుతారు. ఆడపిల్ల అని తెలియగానే మొహం మాడ్చుకుంటారు. లక్షలు కట్టి కొడుకును కార్పొరేట్ స్కూల్లో చేర్పిస్తారు. ఆడపిల్లలను మాత్రం గవర్నమెంట్ బళ్లకు తోలుతారు. ఒకటా రెండా.. పురుషాధిక్య సమాజంలో బాలికలు అన్నిరకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటన్నిటిని తానూ భరించారు కాబట్టే, ఆడపిల్లల కోసం ఒక స్వచ్ఛంద సంస్థ స్థాపించారు హైదరాబాద్కు చెందిన రోహిణి నాయుడు. కొత్తగా ‘ప్రాజెక్ట్ పీరియడ్’అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారామె. ఈ సందర్భంగా ‘జిందగీ’తో రోహిణి పంచుకొన్న అనుభవాలు..
నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను. 16 ఏండ్లకే పెండ్లి చేశారు. చదువుకోవడానికి అత్తింటి వాళ్లు ఒప్పుకోలేదు. పట్టుదలతో ట్యూషన్లు చెప్పుకొంటూ, ఎవరినీ రూపాయి అడగకుండానే డిగ్రీ చేశాను. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. అయినా ఏరోజూ వెనుకడుగు వేయలేదు. బాగా చదువుకుని, మంచి ఉద్యోగం చేయాలని మనసులో బలంగా ఉండేది. అందుకే డిగ్రీ, బీయీడీ పూర్తయ్యాక ఇద్దరు కొడుకుల్నీ చూసుకుంటూ, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లిష్ చదివాను. తర్వాత, వివిధ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశాను. సాఫ్ట్స్కిల్స్, యాక్సెంట్ ట్రెయినర్గానూ పాఠాలు చెప్పాను. విద్య విలువ తెలిసినదాన్ని కాబట్టే, ఆడపిల్లలకు చదువు అవసరాన్ని నొక్కి చెబుతుంటాను.
‘ది గర్ల్ ఫౌండేషన్’ గురించి..
నాకు మొదటి నుంచీ అనాథాశ్రమాల్లో సేవ చేయడం అలవాటు. వారాంతాల్లో అక్కడి పిల్లలను చదివించేదాన్ని. ఆడపిల్లలకు ఎన్ని ఇబ్బందులు ఉంటాయో నాకు ప్రత్యక్షంగా తెలుసు. వాళ్ల కోసం ఏదైనా చేయాలని బలంగా అనిపించేది. అప్పట్లో నాకు ఎన్జీవోలూ, ట్రస్ట్ల గురించి అవగాహన లేదు. కానీ, ప్రతి అమ్మాయి ఎదుగుదలకు ఏం కావాలో ఆలోచించాను. లైఫ్ స్కిల్స్ కోర్సులు, ఉద్యోగావకాశాలు, ఆత్మరక్షణ, ఆరోగ్యం గురించి నలుగురికీ చెప్పాలన్న ఉద్దేశంతో 2017లో ‘ది గర్ల్ ఫౌండేషన్’ను రిజిస్టర్ చేయించాను. అప్పటి నుంచీ ఒక్కో ఏడాది ఒక్కో సమస్యపై పని చేస్తున్నా. మొదటి సంవత్సరం ఒక గవర్నమెంట్ స్కూల్ పిల్లలపై ఫోకస్ పెట్టాను. తర్వాత ఏడాది వంద స్కూళ్లను లక్ష్యంగా నిర్ణయించుకున్నాను. ఆపైన ‘మెనుస్ట్రువల్ హెల్’్త పై దృష్టి సారించాను. బాగా చదువుకుని, ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా ఈ విషయాలను పిల్లలతో మాట్లాడటానికి సిగ్గు పడతారు. దాంతో ఆడపిల్లలకు తమ శరీరంలో జరుగుతున్న మార్పుల గురించి తెలియటం లేదు. స్కూళ్లు, కాలేజీలు, మురికివాడలు, అనాథాశ్రమాలు.. ఇలా చాలాచోట్లకు వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను.
అవగాహన కోసం
ప్రతి అమ్మాయికి తన ఆరోగ్యం గురించి పూర్తి అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ‘ప్రాజెక్ట్ పీరియడ్’ మొదలుపెట్టాం. గైనకాలజిస్ట్లతో కలిసి పని చేస్తున్నాం. శానిటరీ ప్యాడ్ వాడకం నుంచి వాటి డిజైనింగ్ వరకూ అనేక అంశాలపై కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆర్గానిక్ ప్యాడ్స్ను ప్రజలకు పరిచయం చేస్తూ, వాటివల్ల కలిగే లాభాల గురించి చెబుతున్నాం. ప్యాడ్ల విషయంలో ఏ అమ్మాయీ బాధ పడకూడదన్నది నా ఆలోచన. ఈ రెండేండ్లలో వేలకొద్దీ ఆర్గానిక్ కాటన్ బయోడీగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్లను పేదలకు పంచాం.
పీరియడ్ బ్యాంక్
‘ది గర్ల్ ఫౌండేషన్’ను మొదలు పెట్టిన దగ్గర నుంచి నిన్నమొన్నటివరకూ నా సొంత డబ్బుతోనే కార్యక్రమాలు నిర్వహించాను. సేవలను మరింత విస్తరించే ఉద్దేశంతో ఈమధ్యే ఫండ్ రైజింగ్కు పిలుపునిచ్చాను. నా వర్క్ చూసి స్నేహితులు స్వచ్ఛందంగా కొంత డబ్బు ఇచ్చారు. వికలాంగ మహిళలు తయారు చేస్తున్న ఆర్గానిక్ బయో డీగ్రేడబుల్ ప్యాడ్లు పెద్ద మొత్తంలో కొని, ‘ప్రాజెక్ట్ పీరియడ్’ లోగోతో తిరిగి అమ్ముతున్నాం. ఆ లాభంతో మరిన్ని ప్యాడ్లను పేద అమ్మాయిలకు అందజేస్తున్నాం. ఎవరైనా వంద రూపాయలతో మా ప్యాడ్లు కొన్నాసరే, డొనేట్ చేసినా సరే.. ఆడపిల్లకు నెలకు సరిపడా ప్యాడ్లు మేం అందిస్తాం. ఇవి నెలరోజుల్లోనే మట్టిలో డీకంపోజ్ అయిపోతాయి. పైగా అది ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది. పెరట్లోనే గుంత తవ్వి ప్యాడ్లను పాతిపెట్టవచ్చు. అదే చోట మొక్కలనూ పెంచవచ్చు. ఆర్గానిక్ ప్యాడ్ల వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గడంతో పాటు పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది.
ప్రయోగాత్మకంగా విల్లామేరీ కాలేజీలో ‘పీరియడ్ బ్యాంక్’ను ఏర్పాటు చేశాం. ఎవరైనా సరే, తమకు తోచినంత సాయం చేస్తే ఆ మొత్తంతో ప్యాడ్స్ కొని ఆ బ్యాంక్లో ఉంచుతాం. పేద విద్యార్థులు నెలసరి సమయంలో ఆ బ్యాంక్లోని ప్యాడ్లను ఉచితంగా వాడుకోవచ్చు. మాదాపూర్లోనూ ఒక బ్యాంక్ ఏర్పాటు చేశాం. త్వరలో వివిధ ప్రాంతాల్లోని మురికివాడల్లో శాఖలు పెట్టేందుకు సిద్ధమవుతున్నాం. మా ఫౌండేషన్ ద్వారా ఆడపిల్లలకు అన్ని విషయాల్లో అండగా ఉండాలన్నది నా ఆశయం. చాలా కాలం నుంచీ పేద విద్యార్థులకు ఉచితంగా ఇంగ్లిష్ కమ్యూనికేషన్ క్లాసులు తీసుకుంటున్నాను. వారానికి మూడురోజులు, రోజూ గంట చొప్పున ట్రయినింగ్ ఇస్తున్నాను. ఆ నైపుణ్యం వారిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగి స్తున్నది. ఎదగాలనే తపనను రగిలిస్తున్నది. త్వరలో ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసులు ప్రారంభించబోతున్నాను. ‘వేదమంత్రం’ అనే ఈ-కామర్స్ సైట్లో వెడ్డింగ్ కలెక్షన్స్ పెట్టి ఆర్డర్స్ తీసుకుంటున్నాం. ఏ పని చేపట్టినా, నా మొదటి ప్రాధాన్యం ఫౌండేషన్ మాత్రమే.
… నిఖిత నెల్లుట్ల
అందాల పోటీలు..
చిన్నప్పుడు .. ప్రతి అమ్మాయికీ మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ కావాలని ఉంటుంది. అలా నాకూ ఉండేది. కానీ అప్పటి పరిస్థితులు వేరు. ఇన్నాళ్లకు నా ఆశ తీరింది. మా ఫ్రెండ్స్ సలహా మేరకు అందాల పోటీకి దరఖాస్తు చేశాను. 2018లో ‘బెస్ట్ అటైర్ అవార్డు’ వచ్చింది. తర్వాత ‘మిసెస్ ఆసియా టూరిజం’ పోటీల్లో గెలిచాను. ఆపైన మిసెస్ యూనివర్స్ కిరీటాన్నీ దక్కించుకున్నాను. వచ్చిన అవకాశాలను ఎందుకు కాదనాలన్న ఉద్దేశ్యంతో సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు చేస్తున్నాను. ప్రస్తుతం ‘దృశ్యం-2‘ తదితర ప్రాజెక్టులు ఒప్పుకొన్నాను. చిన్నదైనా, గుర్తింపు తెచ్చే పాత్ర చేయాలని కోరుకుంటున్నా.