నెత్తిన పాలకుండతో ఆ దారి వెంట వెళ్తున్న ప్రతి సారీ సుజాత కళ్లు ఓ మహావృక్షం కింద తపోముద్రలో కూర్చున్న ఆ సాధకుడిని గమనించేవి. ఆ వేళా విశేషం ఏమిటో మరి, ఆయన దర్శనం తర్వాత ఆమెకు పెండ్లయింది, కడుపు పండింది. అప్పటికే ఆరేండ్లు గడిచిపోయాయి. అన్నపానీయాలు ముట్టని ఆ సాధకుడు రోజురోజుకూ శుష్కించి పోతుంటే తట్టుకోలేకపోయింది. ఓ పున్నమి పూట, కమ్మని పాయసం వండి ప్రసాదంగా తీసుకెళ్లింది. భక్తితో పాదాలను స్పృశించింది. ఆ అలికిడికి ధ్యానంలోంచి బయటికొచ్చాడాయన. ఆమెను చూసి ఎవరో వనదేవత అనుకున్నాడు. ‘స్వామీ! నువ్వు బుద్ధుడివి. సత్యాత్మవి. ఇంకెంత కాలం శరీరాన్ని హింసించుకుంటావు’ అని పాయసాన్నం తినిపించింది. ఆ ఆహారంతో సత్తువ సమకూరింది. మధ్యేమార్గమే ఉత్తమమన్న ఎరుక వచ్చింది. తన ఆలోచనా విధానాన్ని మార్చిన సుజాతను గౌతమబుద్ధుడు ఎప్పుడూ మరచిపోలేదు. ఆయన తొలి శిష్యురాలు ఆమే. సుజాత పేరిట ఓ స్థూపమూ నిర్మితమైంది. నేడు ‘బుద్ధ పూర్ణిమ’. గౌతముడిలోని బుద్ధుడిని సుజాత గుర్తించిన రోజు.