యవ్వనం వచ్చాక ఓ తోడు అవసరం, ఒంటరిగా ఉండటం మంచిదికాదు. వీలైనంత తొందరగా పెండ్లిబంధంతో ఒక్కటై సంసారాన్ని చక్కదిద్దుకోవాలి. ‘భార్య లేని మొగోనికి బాధలు ఎక్కువ.. భర్త లేని ఆడదానికి బదునాము ఎక్కువ’ అనే సామెత ద్వారా ఈ హెచ్చరిక చేశారు పెద్దలు. స్త్రీకి యవ్వనంలో భర్త.. ఆ తర్వాత సంతానం తోడుగా ఉంటారు. ఒకవేళ పెండ్లి అనే తంతు లేకపోతే.. ఏకాకి జీవితం తప్పదు. ఒంటరి ఆడవాళ్లపై ఎన్నో నిందలు వేస్తుంది సమాజం. ఎవరితోనైనా కొంచెం చనువుగా ఉన్నా.. చెయ్యని తప్పులను అంటగట్టి బద్నాం చేస్తుంది. ఒక్కోసారి ఆ అపనిందలే ప్రాణాల మీదికి వస్తాయి. పురుషుడైనా ఇందుకు మినహాయింపు కాదు. ఇంట్లో ఇల్లాలు లేకపోతే సమాజంలో గౌరవం లభించదు. ప్రతి పనీ తనొక్కడే చేసుకోవాలి. అదే ఇద్దరయితే ఆడుతూపాడుతూ పని చేసుకోవచ్చు.
‘వామ్మో.. ఆ కష్టం మల్లోసారి చెయ్యలేనయ్యో.. ఒక్కసారిగా నా తలపానం తోకకొచ్చింది’ – బాగా కష్టమైన పని చేసినప్పుడు అంటుంటారు జానపదులు. అంటే ఆ కష్టానికి తల నుంచి కాలి వరకూ ప్రతి అవయవం కదిలిందని, దానివల్ల ఒళ్లు నొప్పుల కుంపటిగా మారిందని, అలాంటి కష్టం మరొకసారి చేసేంత ధైర్యమూ, ఓపికా తనకు లేదనీ ఒక్క పదంలో చెప్పడం. ‘తలప్రాణం తోకకు రావడం’ వెనుకా ఓ నేపథ్యం ఉంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు.. పల్లెల్లో పాముల తాకిడి ఎక్కువగా ఉండేది. రాత్రిళ్లు హానికరమైన విషసర్పాలు కాటు వేస్తాయనే భయంతో.. పగటిపూట ఎక్కడ కనిపించినా చంపేసేవారు. నిజానికి, పాము ఒక్కసారిగా చనిపోదు. తలను చితకబాదినా.. దాని తోకవరకూ ప్రాణం ఉంటుంది. పాము తలలో చలనం లేకపోయినా, తోక మాత్రం కొన్ని నిమిషాలపాటు కొట్టుకుంటూనే ఉంటుంది. అలా భరించలేని కష్టం వచ్చినప్పుడో.. తీరని బాధ అనుభవించినప్పుడో.. ఆ పరిస్థితిని చెప్పడానికి ‘తలపానం తోకకొచ్చింది’ అంటారు జానపదులు.
వర్షాకాలం మొదలైందంటే చాలు.. ఏ ఇద్దరు ముగ్గురు రైతులు కూడినా ‘ఏరు ముందా? ఏకాశి (తొలి ఏకాదశి) ముందా?’ అనే చర్చలే జరుగుతాయి. ఎందుకంటే ఏకాదశి నాటికి వర్షాలు సమృద్ధిగా కురిస్తే.. చెరువులు నిండుతాయి. జలరాశి పెరగడంతో తగినన్ని పంటలు వేసుకోవచ్చని ఆశ. ప్రకృతి సకాలంలో కరుణిస్తే.. ఏకాదశికి ముందుగానే ఏరు పొంగుతుంది. ఒకవేళ ఏకాశి దాటినా ఏరు రాకపోతే.. ఆ ఏడాది కరువు తప్పదనే నమ్మకం రైతుల్లో బలంగా ఉంటుంది. తొలి ఏకాదశిని ప్రజల్లో చైతన్యానికి ప్రతీకగా చెబుతారు. ఏకాదశి అంటే.. ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, మనసు కలిపి మొత్తం పదకొండు అని అర్థం. అయితే ఈ ఏడాది మాత్రం గడిచిన కొద్ది రోజులుగా నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తొలి ఏకాదశికి ముందుగానే నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది ఏకాశి ముందుగా ఏరు వచ్చిందని చెప్పవచ్చు. పురాణాల ప్రకారం.. ఆషాఢమాసం, శుక్లపక్షం ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి ‘శయన ఏకాదశి’ అనీ అంటారు. సతీ సక్కుబాయి శయన ఏకాదశి రోజునే మోక్షప్రాప్తి పొందింది. ‘అన్నీ తెలిసినమ్మ అమాసనాడు పోతే.. ఏమీ ఎరగనమ్మ ఏకాశినాడు పోయింది’ అనే సామెతా ఉంది.
వాసనబియ్యం = బాస్మతి బియ్యం (అల్లుడు తొలిసారి ఇంటికొత్తాండు.. వాసనబియ్యంతో బువ్వండు. నేనెల్లి యాటకూర తెత్త. కమ్మగా వండిపెట్టాలె)
తాలంగొట్టుడు = తప్పును సమర్థించడం (ఎందుకురా వాడి తప్పులకు నువ్ తాలంకొడుతున్నవ్? నీకేమైనా అందులో భాగముందా?)
రిల్లెలు వట్టియన్ = కాళ్లు పట్టుకుపోవడం (ఎంతసేపని ఆడ్నే కూసుంటవ్రా.. రిల్లెలు(తిమ్మిర్లు) పడితెగాని నీ తిక్క అణగదు)
సవసవ = వేడివేడిగా, జ్వరానికి సూచన (చిన్నోడి ఒళ్లు సవసవలాడుతుంది. దవాఖానకు జల్ది పోదాం పదా..)
దునుకుడు = దూకడం (మొన్న మొగులుకు తూటుపడ్డట్లు ఆన కురిస్తే.. దెబ్బకు చెరువులన్నీ అలుగులు దుంకుతున్నయ్)