పుట్టపాక మహిళ ఆవిష్కరణ
ఆమె చదువుకున్నది ఆరో తరగతే. అయితేనేం, తలపండిన నేత కళాకారులను తలపించేలా తేలియా రుమాళ్ల తయారీలో అద్భుతాలు సృష్టిస్తున్నది. రసాయనాల ఊసే లేకుండా, సహజసిద్ధమైన రంగులద్దుతూ గల్ఫ్ దేశాల్లో తెలంగాణ ఘనతను చాటుతున్నది. తేలియా రుమాళ్ల తయారీని జీవనాధారం చేసుకొన్న కుటుంబాలు వేళ్ల మీదే ఉన్నాయి. వాటిలో ఒకటి నీరజ కుటుంబం. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని పుట్టపాక గ్రామానికి చెందిన అయిటిపాముల నీరజ స్ఫూర్తిదాయక ఆవిష్కరణ గురించి …
తేలియా రుమాళ్ల తయారీలో పుట్టపాక గ్రామానిది వందేండ్ల్ల చరిత్ర. ఊర్లోని ఆరొందల కుటుంబాల్లో తొంభై శాతానికి పైగా మరమగ్గాలనే నమ్ముకుని జీవిస్తున్నాయి. ఇక్కడ నేసిన తేలియా రుమాళ్లు, డబుల్ ఇక్కత్ డాబీబోన్ చీరెలు, డబుల్ ఇక్కత్ డాబీబోన్ దుప్పట్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందాయి. అనేకానేక కారణాలతో, చాలా కుటుంబాలు తేలియా రుమాళ్ల తయారీకి స్వస్తి పలికాయి. కానీ అయిటిపాముల శంకర్, నీరజ దంపతులు మాత్రం వారసత్వంగా వచ్చిన వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు.
బాల్యంలోనే తర్ఫీదు..
నీరజ పుట్టిల్లు చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెం. అమ్మానాన్న మగ్గంపై చీరెలు నేసేవారు. నీరజ వారికి చేదోడుగా ఉండేది. నూలు వడకడం, కండెలు పట్టడం, అచ్చులు అతకడం, రంగుల అద్దకం.. వంటి పనులు చేస్తూనే, నేత మీదా పట్టు సాధించింది. అవసరాన్ని బట్టి, అందమైన డిజైన్లతో చీరెలు నేసేది. ఇరవై ఏండ్ల క్రితం నీరజకు పుట్టపాకకు చెందిన అయిటిపాముల శంకర్తో పెండ్లయింది. పుట్టింట నేర్చుకున్న సిల్క్ చీరల నేతకు స్వస్తి పలికి.. భర్త బాటలో నడిచింది. తేలియా రుమాళ్ల తయారీలో నైపుణ్యాన్ని పెంచుకుంది. కొత్తకొత్త ప్రయోగాలు చేసి, తేలియా రుమాళ్లకు సరికొత్త వన్నెలు తీసుకొచ్చింది.
అరబ్ దేశాలకు ఎగుమతి..
నిజాం కాలం నుంచే పుట్టపాక తేలియా రుమాళ్లు అరబ్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. చెట్లు, పూల నుంచి తీసిన రంగులతో సహజసిద్ధంగా తయారు చేస్తారు వీటిని. ఈ రుమాళ్లు ఎండాకాలం చల్లగా, చలికాలం వెచ్చగా ఉంటాయి. నిత్యం సువాసనలు వెదజల్లుతాయి. ప్రస్తుతం ఒక్కో రుమాలు రూ.4 వేలు పలుకుతుంది. హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారి ద్వారా అరబ్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు నీరజ. తేలియా రుమాళ్లను తయారు చేయడం ఆషామాషీ కాదు. 20 రోజులపాటు సాగే చేనేత యజ్ఞమిది. ఆముదం పొట్టు బూడిద, చెట్ల బెరళ్ల రంగులను నూలుకు అద్ది ఆముదం లేదా నువ్వుల నూనెలో నానబెడతారు. ఉదయం, సాయంత్రం నూలును శుభ్రంగా ఉతుకుతారు. ఆ తర్వాత ఆరబెడతారు. మళ్లీ నీళ్లలో నానబెడతారు. ఇలా ఇరవై రోజులపాటు చేస్తే.. దారాల్లోకి నూనె ఇంకిపోతుంది. రంగులు చక్కగా అంటుకుంటాయి. ఆ దారాల సాయంతో అందమైన డిజైన్లలో వస్ర్తాన్ని నేస్తారు. తేలియా రుమాలులో వాడే రంగులు నూటికి నూరుశాతం సహజ సిద్ధమైనవి. పటిక, కరక్కాయ, హీరా కాసు తదితర దినుసులతో పాటు.. ఎరుపు, నీలం, పసుపు మొదలైన వర్ణాలను చెట్ల బెరడులు, ఆకుల నుంచి తయారు చేస్తారు. రసాయనాలతో అయితే, అరవై రోజుల్లో 64 పీసుల వరకూ తేలియా రుమాళ్లను నేయవచ్చు. సహజసిద్ధమైన రంగులతో అరవై రోజుల్లో 20 పీసులకు మాత్రమే ప్రాణం పోయగలరు.
పురస్కారాల పల్లె
తేలియా రుమాలుకు పునరుజ్జీవం పోసింది పుట్టపాక నేత కార్మికులే. సంప్రదాయంగానే కాకుండా.. మారుతున్న అభిరుచులకు, జాతీయ -అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తమ కళకు, నైపుణ్యానికి మెరుగులు పెట్టుకుంటున్నారు. ఇప్పటికే ఈ గ్రామానికి చెందిన పలువురు నేతన్నలు అనేక అవార్డులను సొంతం చేసుకున్నారు. తాజాగా ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు అందుకున్నది అయిటిపాముల నీరజ. ‘ఒకప్పుడు ఒకటి, రెండు రంగుల్లోనే తేలియా రుమాళ్లను తయారు చేసేవాళ్లం. ఇప్పుడు వివిధ డిజైన్లలో అన్ని రంగుల్లోనూ నేస్తున్నాం. బాల్యం నుంచే మగ్గంపై నైపుణ్యం ఉండటం నాకు కలిసొచ్చింది. మా ఆయన శంకర్ ప్రోత్సాహంతోనే ప్రకృతి సిద్ధమైన రంగులతో రుమాళ్లను ఆవిష్కరించగలిగాను. ఈ పురస్కారం చేనేతకు దక్కిన గౌరవం. రానున్న రోజుల్లో మరిన్ని ప్రయోగాలకు శ్రీకారం చుడతా’ అంటున్నది నీరజ.
… గంజి ప్రదీప్ కుమార్
యాదాద్రి భువనగిరి
Photo: నరేశ్