కొవిడ్పై పోరాటంలో ఆయన తెలంగాణ దళాలకు సర్వ సైన్యాధ్యక్షుడు. ఆయన నోటినుంచి ‘పరిస్థితి నియంత్రణలో ఉంది’ అన్న ఒక్కమాట చాలు. జనానికి ఎక్కడ లేని ఊరట. కనిపించని శత్రువును కట్టడి చేస్తూ, పరిస్థితిని అదుపులోకి తీసుకు రావడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు నేతృత్వంలోని నిపుణుల బృందం పెద్ద యుద్ధమే చేస్తున్నది. ఆ మాటకొస్తే శ్రీనివాసరావుకు పోరాటాలు కొత్తేమీ కాదు. ఓ దశవరకూ ఆ యుద్ధం వ్యవస్థను వేధించే రుగ్మతలమీద, ఆ తర్వాత ప్రజలను ఇబ్బంది పెట్టే అనారోగ్యాలమీద. అంతే తేడా! కమ్యూనిస్టు భావజాలం నుంచి కరోనాపై పోరాటం వరకూ ఆ మలుపులన్నీ ఆయన మాటల్లోనే.
నా బాల్యాన్ని గుర్తు చేసుకుంటే చిత్రంగా అనిపిస్తుంది. మాది రైతు కుటుంబమే అయినా కమ్యూనిస్ట్ భావజాలం ఉండేది. మా పెదనాన్నలు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రాణాలు కోల్పోయారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా తనికెళ్ల మా స్వగ్రామం. నాన్న గడల సూర్యనారాయణ ఆయుర్వేద వైద్యులు. పెండ్లికి ముందే అశ్వాపురంలో స్థిరపడి అక్కడే వైద్యసేవలు అందించేవారు. అల్లోపతిలోనూ ప్రవేశం ఉండేది. అప్పట్లో రోగులు డబ్బులకు బదులు ధాన్యం, కూరగాయలు ఇచ్చేవారు. దీంతో మా ఇంట్లో ధాన్యపు రాశులు ఉండేవి. మా అమ్మ సత్యవతి గృహిణి. మేం నలుగురు సంతానం. నేను పెద్దవాణ్ని. ముగ్గురు ఆడపిల్లలు.
నా ప్రాథమిక విద్య అంతా ఇంట్లోనే. అయిదేండ్లు వచ్చేసరికి పెద్దబాల శిక్ష పూర్తి చేశాను. తర్వాత, నేరుగా అశ్వాపురంలో ఆరో తరగతిలో చేరాను. భద్రాచలంలో ఏడో తరగతి చదివాను. ఆ సమయంలోనే ఏన్కూరులో రెసిడెన్షియల్ పాఠశాల ప్రారంభమైంది. హైస్కూల్ చదువు అక్కడ పూర్తి చేశాను. ఇంటర్లో ఎంపీసీ తీసుకుందామని అనుకున్నా. కానీ, నాన్న నన్ను ఎంబీబీఎస్ డాక్టర్గా చూడాలనుకున్నారు. ఆయన ప్రోత్సాహంతో బైపీసీ ఎంచుకున్నాను. ఖమ్మంలోని శారదా కాలేజీలో చేర్పించారు. నాన్న కల నిజం చేయడానికి కష్టపడి చదివాను. ఎంసెట్లో 439వ ర్యాంక్ సాధించాను. ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. తర్వాత పీజీకూడా చేశాను.
చిన్నప్పటి నుంచీ పెరిగిన వాతావరణం, కమ్యూనిస్ట్ భావజాలం నన్ను అపారంగా ప్రభావితం చేశాయి. నాన్న డాక్టర్ కావడంతో నక్సలైట్లు వైద్యం కోసం మా ఇంటికి వస్తుండేవారు. చండ్ర పుల్లారెడ్డి, ఆయన భార్య రాధక్క, ఇతర ప్రముఖులను చాలా దగ్గరగా చూశాను. ఈ నేపథ్యం ఓ కారణం కావచ్చు. చిన్నప్పుడు నాలో ఆవేశం ఎక్కువ. ఓసారి మా గ్రామంతోపాటు రెండు పంచాయతీల్లో కమ్యూనిస్ట్లు గెలిచారు. విజయోత్సవ ఊరేగింపులో నేనూ పాల్గొన్నా. మూడు రోజులు ఇంటికి వెళ్లకుండా వాళ్ల వెంటే తిరిగా. విషయం తెలుసుకున్న నాన్న తీవ్రంగా కొట్టారు. అదే నా జీవితంలో టర్నింగ్ పాయింట్. అప్పటినుంచి చదువుపైనే దృష్టి నిలిపాను. నాన్న నా దారి మళ్లించకపోతే, అప్పుడు నాకున్న ఆవేశానికి అన్నల్లో కలిసే వాడినేమో! ఎంబీబీఎస్ చదివే రోజుల్లోనూ అదే ఆవేశం. అప్పటి ప్రభుత్వం 13 ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అనుమతించింది. ప్రైవేటు వైద్యవిద్యకు వ్యతిరేకంగా పోరాటం చేశా. మూడు రోజులు నిరాహార దీక్ష చేపట్టా. 1993 నుంచి మూడేండ్లు ఉస్మానియా మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. తర్వాత మెడికల్ కాలేజీల్లో యూనియన్లను రద్దు చేశారు. దీంతో సామాజిక కార్యక్రమాలు చేపట్టాను. మండల్ ఉద్యమంలో కూడా పాల్గొన్నాను.
ప్రైవేట్ వైద్యవిద్యకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు బాయ్కాట్ చేపట్టాం. ఆ సమయంలో సికింద్రాబాద్లోని వనిత మహావిద్యాలయానికి వెళ్లాను. అక్కడే గాయత్రిని తొలిసారిగా చూశాను. ఆ పరిచయం తర్వాత పరిణయంగా మారింది. నాదేమో పల్లెటూరి నేపథ్యం. తను కోఠి, సుల్తాన్బజార్ ప్రాంతంలో పెరిగిన అమ్మాయి. నా విజయంలో ఆమె పాత్ర చాలా కీలకం. ఎంబీబీఎస్ పూర్తి కాగానే మా పెండ్లయింది. ఆ తర్వాతే పీజీ చదివా. గాయత్రి బీఎస్సీ మైక్రో బయాలజీ చేసింది. తన ప్రోత్సాహంతోనే ఉన్నత స్థాయికి చేరుకోగలిగా. వృత్తిపరమైన బాధ్యతలతో, కుటుంబ వ్యవహారాలను నేను అంతగా పట్టించుకోకున్నా తనే అన్నీ నడిపింది. మాకో పాప. డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నది.
గ్రామీణ అనారోగ్యంపై నాకు లోతైన అవగాహన ఉంది. కాబట్టే, ఎంబీబీఎస్ తర్వాత క్లినికల్ వైపు కాకుండా, ప్రజారోగ్య రంగంలో స్పెషలైజేషన్ చేశాను. ఒకవేళ క్లినికల్ వైపు వెళ్తే రోజుకు 10, 20 మందికి చికిత్స అందించగలను. మహా అయితే, నా జీవితకాలంలో లక్షమందికి ట్రీట్మెంట్ చేయగలుగుతా! అందుకే, కోట్లమంది ఆరోగ్యాన్ని ప్రభావితం చేయొచ్చనే ఉద్దేశంతో పబ్లిక్ హెల్త్ రంగాన్ని ఎంచుకున్నా. ప్రభుత్వ సర్వీస్లో చేరాక ఉస్మానియా మెడికల్ కాలేజీ పబ్లిక్ హెల్త్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో పని చేశాను. వరంగల్లో మున్సిపల్ హెల్త్
ఆఫీసర్గా, ఎన్హెచ్ఎం ఫస్ట్ ప్రోగ్రామ్ మేనేజర్గా పలు బాధ్యతలు నిర్వర్తిస్తూ 2018లో పబ్లిక్ హెల్త్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టాను. పబ్లిక్ సర్వీస్లో చేరినప్పటి నుంచీ ఉద్యోగ బాధ్యతల రీత్యా కుటుంబానికి సమయం ఇవ్వలేకపోయాను. కరోనా నేపథ్యంలో ఇంట్లోవాళ్లతో కూడా మాట్లాడలేని పరిస్థితి. అయితేనేం, నా బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నానన్న సంతృప్తి ఉంది.
నేను పుట్టి పెరిగిన కొత్తగూడెం ప్రాంతానికి నా వంతుగా ఏదో ఒకటి చేయాలనుకున్నా. విద్య, వైద్యం, ఉపాధి కల్పన.. ప్రధాన లక్ష్యంగా నాన్న స్మారకార్థం డాక్టర్ జీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేశాను. సెప్టెంబర్లో నాన్న ప్రథమ వర్ధంతి సందర్భంగా లాంఛనంగా ప్రారంభించనున్నా.
సాధారణంగా ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ పదవిని రిటైర్మెంట్కు దగ్గరగా వున్న డాక్టర్లకు ఇస్తుంటారు. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్గారు సమర్థుడైన అధికారి ఉండాలన్న ఉద్దేశంతో నన్ను నియమించారు. ఏడాదిన్నరగా కొవిడ్ నియంత్రణలో అహర్నిశలూ పనిచేస్తున్నాం. కరోనా కట్టడిలో ముఖ్యమంత్రి మాకెంతో స్వేచ్ఛ నిచ్చారు. మార్గ నిర్దేశనం చేశారు. అందుకే, ఈ మహమ్మారిని ఇతర రాష్ర్టాల కన్నా తెలంగాణలో పకడ్బందీగా ఎదుర్కోగలిగాం.
నాకు ముగ్గురు చెల్లెళ్లు. వారిలో చిన్న చెల్లెలు ఎనిమిదేండ్ల వయసులో బ్రెయిన్ ఫీవర్తో అకస్మాత్తుగా చనిపోయింది. తనంటే మాకు చాలా ఇష్టం. ఆ మరణం నన్నెంతో కలచి వేసింది. ఇప్పటికీ తను గుర్తొచ్చినప్పుడల్లా మనసు భారమవుతుంది. ఏడాది కిందట కొవిడ్ కారణంగా నాన్నను దూరం చేసుకున్నా. కరోనా సమయంలో పెద్దవాళ్లయిన అమ్మానాన్న నా దగ్గర ఉండటం రిస్క్ అవుతుందని కొత్తగూడెంలో ఉంచాను. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇద్దరూ కరోనా బారిన పడ్డారు. అమ్మ కోలుకుంది. కానీ, పోస్ట్ కొవిడ్ సమస్యలతో నాన్న కన్ను మూశారు. నా చదువు, భవిష్యత్కోసం నాన్న పడిన ఇబ్బందులు నాకు తెలుసు. ఇంటికి పెద్దవాణ్ని అయినా, చదువు దెబ్బ తింటుందని కుటుంబ బాధ్యతలన్నీ ఆయనే భుజానికెత్తుకున్నారు. నాన్నను కోల్పోవడం నా జీవితంలో తీరని విషాదం.
–వరకవుల దుర్వాసరాజు