విద్యార్థులు కరువై, ఇక మూసేద్దామని అనుకున్న పాఠశాలకు సొంత ఖర్చుతో ప్రాణంపోశారు ఓ ఉపాధ్యాయురాలు. పిల్లలే లేని చోట 20 మంది విద్యార్థులను చేర్పించి.. గూడెం బడిని గుడిగా మార్చారు. పుస్తకాలతో పనిలేకుండా పాఠశాల గోడలే పాఠాలు బోధించేలా తీర్చిదిద్దారు ఉపాధ్యాయురాలు వసుంధర.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్ర పరిధిలోని గుర్రంపేట సమీపంలో ఉంటుంది.. రాంనాయక్ తండా. ఇక్కడ 100 గిరిజన కుటుంబాలున్నాయి. ఓ పాఠశాల కూడా ఉంది. కానీ, విద్యార్థులు లేక దాన్ని మూసేయాలని అధికారులు నిర్ణయించారు. బడిని మూసేస్తే పిల్లల వికాసానికీ తాళాలు పడుతాయి. ఆ విద్యాలయాన్ని ఎలాఅయినా బతికించాలనుకున్నారు ఉపాధ్యాయురాలు వసుంధర. సొంత ఖర్చుతో రంగులు వేయించారు. పాఠ్యాంశాలను గోడలపై చిత్తరువులుగా గీయించారు. తండా సర్పంచ్ సహకారంతో ప్రైవేట్ బడికి వెళ్తున్న పిల్లలను ఒప్పించి రప్పించగలిగారు. విద్యార్థులను తల్లిలా ఆదరించారు. అంతేకాదు, ఆంగ్లంలోనూ బోధన ప్రారంభించారు. ప్రస్తుతం, ఈ బడిలో 20 మంది పిల్లలు చదువుతున్నారు. బడిని చూసినవారంతా ‘మా పిల్లలను ఇక్కడికే పంపిస్తాం’ అంటున్నారు. ‘నా శక్తి మేరకు పాఠశాలను అభివృద్ధి చేశాను. డిజిటల్ తరగతులు నిర్వహించాలని భావిస్తున్నా. అధికారులు, దాతలు సహకరిస్తే మరిన్ని కార్యక్రమాలు చేపడతాను’ అంటున్నారు వసుంధర.
… తిరుపతి