ఆ పంతులమ్మకు స్కూల్ తర్వాతే ఏదైనా! విద్యార్థుల తర్వాతే ఇంకెవరైనా. పాఠశాలలో చేరింది మొదలు బడి రూపురేఖలే మార్చేశారు. కార్పొరేట్ స్కూల్కు దీటుగా తీర్చిదిద్దారు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ఇందిరానగర్ కాలనీ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు మేకల జ్యోతిరాణి. ఈ పాఠశాలలో మొదట్లో పట్టుమని పదిమంది విద్యార్థులు కూడా లేరు. జ్యోతిరాణి చొరవతో ఆ సంఖ్య 120కి చేరుకుంది. ఈ ఏడేండ్లలో 200 మంది విద్యార్థులు పెద్ద తరగతులకు వెళ్లారు.
పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడంలో జ్యోతిరాణి విద్యా ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, ఎన్ఆర్ఐల సహకారంతో బల్లలు, ఆటవస్తువులు, వాటర్ ఫిల్టర్లు, టీవీ, ఆటవస్తువులు, మధ్యాహ్న భోజనం కోసం గ్యాస్ స్టవ్, ఇతర సామగ్రి సమకూర్చారు. కొత్త తరగతుల నిర్మాణం చేపట్టారు. బడి ప్రాంగణంలో మహాత్మాగాంధీ విగ్రహం ప్రతిష్ఠించారు. సొంత డబ్బు వెచ్చించి సరస్వతీదేవి, తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేయించారు. విద్యార్థులను చదువులకే పరిమితం చేయకుండా.. అన్నిటా దూసుకుపోయేలా తీర్చిదిద్దుతున్నారు జ్యోతిరాణి. ప్రాథమిక పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏర్పాటు చేయించారు. ఇందుకోసం తానే శిక్షణ తీసుకొనివచ్చి, విద్యార్థులకు తర్ఫీదునిస్తున్నారు. గోరఖ్పూర్లో జరిగిన బుల్బుల్ ఉత్సవంలో విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు. కరోనా సమయంలో బడులు మూతపడటంతో పిల్లలు నష్టపోకుండా యూట్యూబ్ ద్వారా పాఠాలను బోధించారు. అదే సమయంలో స్వచ్ఛంద సంస్థల చేయూతతో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. హరితహారంలో భాగంగా పాఠశాల ప్రాంగణంతోపాటు ఊరంతా మొక్కలు నాటించారు. వాటి సంరక్షణా తనే చూసుకొన్నారు. ఇప్పుడవి చెట్లుగా ఎదిగి నలుగురికీ నీడనిస్తున్నాయి. పాఠశాల ‘స్వచ్ఛ బడి’గా గుర్తింపు సాధించడం విశేషం. తన అంకిత భావానికి గుర్తింపుగా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు అందుకున్నారు జ్యోతిరాణి, ‘హరిత మిత్ర’ పురస్కారమూ వరించింది. ‘అవార్డులూ గుర్తింపుల కన్నా పలు పోటీల్లో నా విద్యార్థులు రాణించడమే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది’ అంటారు జ్యోతిరాణి.
… కాగితపు వెంకటేశ్వరరావు