కరోనా మహమ్మారి ఎందరి జీవితాలనో అతలాకుతలం చేసింది. కళలే ఆధారంగా జీవించే వారంతా ప్రదర్శనలు లేక, తిండికీ బట్టకూ సంపాదన సరిపోక ఛిన్నాభిన్నమయ్యారు. అలాంటి కళాకారుల కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకొచ్చారు ప్రముఖ కథక్ డ్యాన్సర్ మంజరి చతుర్వేది. ఒకప్పుడు ఖవ్వాలీ కచేరీలతో నిత్యం బిజీగా ఉండే గాయకుడు మొహద్ తాజ్, లాక్డౌన్ సమయంలో కుటుంబాన్ని పోషించుకోలేక కూరగాయలు అమ్ముకోవాల్సి వచ్చింది. ఆయన గురించి తెలుసుకున్న మంజరి చతుర్వేది హృదయం ద్రవించింది. ఆన్లైన్ నృత్య ప్రదర్శనలు ఇచ్చి ఆర్థిక సాయం అందించారు. ఆ సేవ ఇచ్చిన ఆత్మ సంతృప్తితో అనేకమందికి ‘సూఫీ కథక్ ఫౌండేషన్’ ద్వారా నిత్యావసరాలు సమకూర్చడంతోపాటు, నెలనెలా దాదాపు రూ. 3,500 వరకు నగదు సాయం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారాకూడా నిధులు సేకరిస్తున్నారు. కొవిడ్ బాధితులకోసం ఇప్పటివరకు రూ.25 లక్షలకు పైగా ఖర్చు చేశారు. ఆకలి తీర్చమంటూ ఫోన్లు చేసే అన్నార్థులకు ఉచితంగా భోజనం పంపిణీ చేస్తున్నారు.