మానవ చరిత్రలోనే అతిపెద్ద పుస్తకం మహా భారతం. ఇందులో ద్రౌపది.. ప్రధాన నాయిక, అంతర్లీనంగా కథానాయిక కూడా! పితృస్వామ్య అవలక్షణాలతో సతమతమవుతున్న సమాజానికి మార్గనిర్దేశం చేసిన పాత్ర ఆమెది. అంతేకాదు.. తనను అవమానించిన, హీనంగా చూసిన వ్యవస్థపై ధైర్యంగా ఆగ్రహం వెళ్లగక్కింది. ఈ నేపథ్యంలో ఆధునిక సమాజానికి ద్రౌపది జీవితాన్ని అన్వయిస్తూ ఇరా ముఖోతి రాసిన పుస్తకం.. ‘సాంగ్ ఆఫ్ ద్రౌపది’. సమకాలీన వ్యవస్థలోని అన్యాయాలపై మహిళలు గొంతెత్తడానికి ద్రౌపది పాత్ర స్ఫూర్తినిస్తుందని అంటారు ముఖోతీ. ఇందులో రచయిత్రి మహాభారత యుద్ధంలో కౌరవులు మరణించిన తర్వాత, వారి భార్యల జీవితంలోని విషాదాన్ని కూడా హృద్యంగా చిత్రించారు. పాతివ్రత్యం, సతీ సహగమనం, వివాహ పవిత్రత, వితంతు పునర్వివాహాలపై నిషేధం లాంటి ఆచారాలూ, దురాచారాలూ మహాభారత కాలానికే సమాజంలో వేళ్లూనుకున్నాయని ‘సాంగ్ ఆఫ్ ద్రౌపది’ ద్వారా తెలియజేశారు ముఖోతి. లక్క ఇంట్లో కుంతి, పాండవులకు బదులుగా ఒక గిరిజన స్త్రీ, ఆమె ఐదుగురు పిల్లలు కాలిపోయిన సంఘటన క్షత్రియులతో పోలిస్తే సమాజంలో ఇతరుల జీవితాలకు ప్రాధాన్యం లేకపోవడాన్ని సూచిస్తుందని అంటారు. అంతేకాదు, ఓ ఆటవిక స్త్రీకి జన్మించడం వల్లే భీముడి కొడుకైన ఘటోత్కచుడికి సరైన గౌరవం దక్కలేదని విశ్లేషించారు. ఇలా మహాభారతంలోని విభిన్న సంఘటనలను, మూలం నుంచి దారి మళ్లకుండా ఆధునిక దృష్టితో విశ్లేషించారు రచయిత్రి.