బేగంపేట్ జూన్ 16: సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని నాలాల పూడికతీత పనులను వచ్చే సోమవారం నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ బుధవారం జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. రాంగోపాల్పేట డివిజన్ నల్లగుట్ట నాలాలో చేపట్టిన పూడికతీత పనులను బుధవారం మంత్రి, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, డిప్యూటీ కమిషనర్ ముకుందరెడ్డి, జలమండలి జీఎం రమణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని నాలాల్లో పూడికతీత పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. పూర్తి స్థాయిలో పనులు చేపట్టేందుకు ఈనెల 14 నుంచి 19 వరకు పనుల పర్యవేక్షణకు స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు నాలాల పూడికతీత పనులపై 59 ఫిర్యాదులు రాగా, 38 పరిష్కరించినట్టు తెలిపారు. అంతే కాకుండా.. నాలాల అభివృద్ధి, నిర్మాణ పనుల కోసం చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.