నా వయసు 38 ఏండ్లు. పెద్దగా ఆరోగ్య సమస్యలు లేవు. కానీ, గత రెండునెలలుగా మూత్రానికి వెళ్లినప్పుడల్లా మంటగా ఉంటున్నది. ఆ హింస భరించలేక పోతున్నాను. అప్పుడప్పుడు నురగలా కూడా వస్తున్నది. మొదట్లో వేడివల్ల ఇలా అవుతుందనుకుని, వేడిచేసే పదార్థాలను తినడం మానేశాను. అయినా, మంట తగ్గటం లేదు. అసలు, నా సమస్యకు కారణమేంటో అర్థం కావడం లేదు. ఇలా ఎందుకు జరుగుతున్నదో తెలుపగలరు? మీ జవాబు కోసం ఎదురుచూస్తూ..
-ఓ సోదరి
జ: చాలామంది మహిళల్లో ఈ సమస్యను చూస్తుంటాం. మూత్రనాళంలో పీహెచ్ అని ఒకటి ఉంటుంది. అందులో ఏమైనా తేడాలు ఉన్నప్పుడు, యోని లోపల ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, నీళ్లు తక్కువగా తాగుతున్నప్పుడు, పబ్లిక్ టాయిలెట్స్ను తరచూ ఉపయోగించినప్పుడు మూత్రంలో మంట వస్తుంది. అపరిశుభ్రమైన లోదుస్తులు వాడుతున్నా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ (యూటీఐ) రావొచ్చు. మూత్రంలో నురగలకు కూడా రకరకాల కారణాలు ఉంటాయి. కిడ్నీ సమస్యలు, హైపో ప్రొటీనూరియా ఉన్నప్పుడు మూత్రం ద్వారా ప్రొటీన్ వెళ్లిపోతుంది. దీని కారణంగానే యూటీఐ రోగుల్లో నురగ కనిపిస్తుంది. యూరినరీ ఇన్ఫెక్షన్లను నివారించాలంటే.. ఎక్కువ మోతాదులో మంచినీళ్లు తాగాలి, పబ్లిక్ టాయిలెట్స్ వీలైనంత వరకు వాడకూడదు. తప్పనిసరి అయితే, శానిటైజ్ చేసుకొని వాడాలి. ఇంట్లోని టాయిలెట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. లోదుస్తులను శుభ్రంగా ఉతుక్కోవాలి. ఇవేకాకుండా కిడ్నీలో చిన్నచిన్న రాళ్లు ఉన్నా మూత్రం మంటగా వస్తుంది. ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి రావడమూ సాధారణమే. ఇలాంటి సందర్భాల్లో వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది. అల్ట్రాసౌండ్ స్కాన్, కంప్లీట్ యూరినరీ ఎగ్జామినేషన్ (సీయూఈ) నిర్వహించి సమస్యను గుర్తిస్తారు. వెంటనే, అవసరమైన చికిత్సను అందిస్తారు.
డా. కావ్యప్రియ వజ్రాల
కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్
యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ