మనిషికి భూమే ఆధారం. అలాంటి భూమాతను, అత్యాశకు పోయి అనగనగా కథలో బంగారు బాతును చంపేసినట్లు తరతరాలుగా కొల్లగొడుతూనే ఉన్నాం. భూమాత దగ్గర నుంచీ తీసుకున్నది తిరిగి ఇవ్వడానికి, ఆమెకు ప్రేమను పంచడానికి ఇదే సరైన సమయమని అంటారు గాయని త్రిథా సిన్హా.
భూమాతకు మనం చేసిన గాయాలకు సంగీత చికిత్సగా పది గేయాలతో ‘పచామమ’ పేరుతో ఒక మ్యూజిక్ ఆల్బమ్ విడుదల చేశారు త్రిథా సిన్హా. వీటిలో శ్వాస, వర్షం, మేఘాలు, ప్రేమ, శృంగారం, మార్మికత, నృత్యం, జ్ఞానోదయం లాంటి వివిధ అంశాలపై గేయాలను సంకలనం చేశారు. పదిహేడేండ్ల వయసులోనే త్రిథ బెంగాలీ సినిమాల్లో పాడటం మొదలుపెట్టారు. తర్వాత బాలీవుడ్ అవకాశాలూ వచ్చాయి. త్రిథా వాయిస్ హీలర్ కూడా. సంగీత చికిత్స చేస్తారు. ఒక ఉద్యమకారిణిగా ఆమె పితృస్వామ్యానికి ముగింపు పలికి, లైంగిక, సామాజిక సమానత్వం సాధించడానికి స్పేస్ (స్టాప్ ప్యాట్రియార్కి అండ్ చూజ్ ఈక్వాలిటీ) అనే సంస్థను స్థాపించారు. తనకు యోగా, సంస్కృతం మీద మంచి పట్టుంది. ‘వాయేజ్ ఫర్ చేంజ్’ అనే సినిమాకు ఆమె అందించిన సంగీతానికి 2019 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘కప్ ఆఫ్ హార్ట్’ పురస్కారం దక్కింది.