హైదరాబాద్కు చెందిన 26 ఏండ్ల శిరీష వాచస్పతికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. అందువల్లేనేమో దేవుడి చిత్రాలను అలవోకగా, భక్తిశ్రద్ధలతో వేస్తుంది. ముఖ్యంగా శ్రీరాములవారి చిత్రాలను గీయడమంటే ఎంతో ఇష్టమట. తన ఇష్టాయిష్టాలు, రాములవారిపై భక్తి గురించి ఆమె ‘జిందగీ’తో పంచుకున్న ఆలోచనలు..
స్కూల్లో డ్రాయింగ్, పెయింటింగ్ కాంపిటీషన్లలో నాకెప్పుడూ మొదటి బహుమతి వచ్చేది. డిగ్రీకి వచ్చాక చిత్రకళకు దూరంగా ఉండిపోయాను. పెండ్లయ్యాక, నా భర్త వాచస్పతి మొదటి పుట్టినరోజుకు గిఫ్ట్గా ఇద్దామని ఒక పెయింటింగ్ వేశాను. అది చూసిన ఆయన చాలా ఆశ్చర్యపోయారు. ‘ఇంత టాలెంట్ పెట్టుకుని ఎందుకు వదిలేశావు? మళ్లీ నీ చేతికి, కుంచెకు పని చెప్పు’ అని కలర్స్, బ్రష్ వంటి మెటీరియల్ మొత్తం తెచ్చారు. నా పెయింటింగ్స్ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక అప్పటినుంచీ అడిగిన వాళ్లందరికీ పెయింటింగ్స్ వేసి ఇచ్చేదాన్ని. ఆఫీసు పని అయిపోయాక, రాత్రిళ్లు నాకంటూ ఒక గంట, రెండు గంటలు కేటాయిస్తున్నాను. లాక్డౌన్లో చాలామంది తమ పిల్లలకు నేర్పించమని అడిగారు. దాంతో, యూట్యూబ్లో ఒక చానెల్ ప్రారంభించాను.
శ్రీరాముడంటే భక్తి
మా నాన్న తాడ్బండ్ హనుమాన్ గుడిలో పూజారి. మా అన్నయ్యకూడా పూజారే. చిన్నప్పటినుంచీ మా ఇంట్లో భక్తిభావన ఎక్కువ. ప్రతి విషయంలోనూ ‘శ్రీరామా.. శ్రీరామా’ అనుకోవడం అలవాటు. మా పెద్ద అత్తయ్య పుట్టినరోజు సందర్భంగా సీతాసమేత శ్రీరాములవారి పట్టాభిషేక చిత్రాన్ని పెయింట్ చేసి గిఫ్ట్గా ఇచ్చాను. ఆమెతోపాటు మా ఇంట్లో వాళ్లందరికీ బాగా నచ్చింది. అంత అందంగా రావడానికి నాకు రాముడిపై ఉన్న భక్తే ప్రధాన కారణం అనుకుంటాను. ఈ ఏడాది శ్రీరామనవమి సందర్భంగానూ కొన్ని పెయింటింగ్స్ వేశాను.