గ్రహాలు సూర్యునితోగల తమ కక్ష్యను సవరించుకొంటాయన్న విషయాన్ని ‘నాసా’ వారు కూడా అంగీకరించారు. విష్ణుచక్రమూ, శివుని త్రిశూలమూ ఘనపదార్థాలతో తయారైన వస్తువులు కావని, ఈనాడు ఆధునిక శాస్త్రజ్ఞులు కనిపెడ్తున్న లేజర్ వంటి కిరణాలతో తయారైన ఆయుధాలని అర్థం చేసుకోవాలి. మన పురాణగాథలను అర్థం చేసుకొనవలసిన విధానమిదే.
తండ్రితో తగవు పడిన శని సూర్యునికి దూరంగా వెళ్లిపోయాడు. ఎంత దూరంగా అంటే అతడు సూర్యునిచుట్టూ తిరిగే కాలం ముప్పై మానవసంవత్సరాలు. శనిగ్రహం తొలుత సూర్యునికి దగ్గరగానే వుండేది.
‘సూర్యుని కథ’లోని విజ్ఞానాంశాలు ఇలా ఉన్నాయి. సూర్యోదయాత్పూర్వం వేకువ జామున మనకు వస్తువులన్నీ లీలగా తెలుస్తాయి. ‘ఇది ఫలాన వస్తువు’ అని అవగాహన వస్తుంది కాని, దాని రూపలావణ్యాలుగాని, రంగులుగాని తెలియవు. ఈ స్థాయిలో ఉండే సూర్యకాంతి పేరు ‘సంజ్ఞ’. సూర్యోదయంతో పరిస్థితి మారిపోతుంది. వర్ణాలతోసహా వస్తువులూ స్పష్టంగా కనిపిస్తాయి. ఈ సూర్యకాంతి పేరు ‘ఛాయ’ లేక ‘చాయ’. సూర్యాస్తమయంతో మళ్లీ వేకువ జాము పరిస్థితి వస్తుంది. సంజ్ఞాదేవి తిరిగి కాపురాని కొస్తుంది.
మానవుని పుట్టుకకు కారణమైనవాడు, మానవ లోకాన్ని పాలించేవాడు ‘మనువు’. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు కలిస్తే ఒక ‘మహాయుగ’మవుతుంది. 72 మహాయుగాల కాలాన్ని ‘మన్వంతరం’ అంటారు. పధ్నాలుగు మన్వంతరాలు గడిస్తే బ్రహ్మకు ఒక పగలు. మన్వంతరమంటే ‘మనువు పాలనా కాలం’. మనం దినం అని పిలుస్తాం. బ్రహ్మ విషయంలో దాని పేరు ‘కల్పం’. ఇప్పుడు నడుస్తున్న కల్పం పేరు ‘శ్వేతవరాహ కల్పం’. ఈ కల్పంలో ఆరుగురు మనువుల కాలం గడచి పోయింది. ‘ఏడవ మనువు’ మనలను పాలిస్తున్నాడు. అతని పేరు ‘వైవస్వతుడు’. సంజ్ఞాదేవి పెద్ద కొడుకు. మానవుని సృష్టి సూర్యుని మాధ్యమంగానే జరిగింది అని సూచన. ఏడవ మన్వంతరాన్నే బైబిలు ‘సెవెంత్ ఎడ్వంట్’ (ఏడవ సృష్టి) అని పిలుస్తున్నది.
‘యమ’ శబ్దం కాల సంబంధి. ‘యామము’ అంటే ‘జాము’ అని అర్థం. సూర్యోదయాస్తమయాల కారణంగానే మానవునికి కాలిక స్పృహ కలిగిందని చెప్పడం. కాలం మరణ సూచకం. సమస్త ప్రాణుల ఆయుష్షును హరించేది కాలమే. కనుకనే కాల నిర్దేశకునిగా ‘యముడు’ అన్న పేరు నిర్ధారితమైంది. ప్రాణులు అనారోగ్య కారణంగా మరణిస్తారు. క్రిముల కారణంగా వ్యాధులు వస్తాయి అని, యముని పాదం తెగిపడినట్లుగా జీవుల ప్రాణాలు వారి దేహాలనుండి వేరై పోతాయని చెప్తున్నారు.
యమునా నదికి అలలు ఎక్కువ. అందుకే, ఆమెను సూర్యుడు ‘విలోలిత’ అన్నాడు. యమున నీరు నల్లగా వుంటుంది. చీకటికి సంకేతం. ‘రాత్రింబవళ్లు’ సూర్యసంతానమన్నమాట. ఛాయ కొడుకు ‘సూర్యసావర్ణి’ మరొక మనువు. ఈ కల్పంలో రాబోయే మన్వంతరం ఇతనిదే. తండ్రితో తగవు పడిన శని సూర్యునికి దూరంగా వెళ్లిపోయాడు. ఎంత దూరంగా అంటే అతడు సూర్యునిచుట్టూ తిరిగే కాలం ముప్పై మానవ సంవత్సరాలు. శనిగ్రహం తొలుత సూర్యునికి దగ్గరగానే వుండేది. క్రమేణా కాలగతిలో శని, సూర్యుల మధ్య దూరం పెరుగుతూ వస్తున్నదన్నమాట.
యమున నది. తపతి నదము. తూర్పు సముద్రంలో కలిసే నీటి ప్రవాహాలు నదులు. పడమటి సముద్రంలో కలిసే ప్రవాహాలు నదములు. ‘నదీ నదములు’ అన్న పదప్రయోగానికి కారణం ఇదే. గుఱ్ఱాలు వేగానికి, ఆరోగ్యానికి సంకేతాలు. అశ్వినీ దేవతల జననం అశ్వాలనుండి సూచించడానికిగల కారణమిదే. మనుషులకు దేవతలకు జవసత్తాలను ఇవ్వగల శక్తి కలిగినందుననే అశ్వినీ దేవతలు ‘దేవ వైద్యులు’ కాగలిగారు. గుఱ్రాలవలె పరుగెత్తే సూర్యకిరణాలు ఆరోగ్యాన్ని సమకూరుస్తాయి. పాశ్చాత్యులు యంత్రశక్తిని ‘హార్స్ పవర్’తో కొలుస్తారు.
అశ్వవిద్య తెలిసిన తొలిమానవుడు రేవంతుడు. అశ్వాల జీవితానికి సంబంధించిన సర్వస్వమూ అతనికి తెలుసు. ఒక రకంగా అతడు తొలి మానవేతర ప్రాణులకు (పశు) వైద్యుడన్న మాట. సృష్ట్యాదిలో సూర్యుడు భూమికి ఇప్పటికన్నా చాలా దగ్గరగా వుండేవాడన్నమాట. సూర్యునికి భూమికిగల కక్ష్య సహజ సిద్ధంగా భూమికి అనుకూలంగా సవరింపబడిందని, ఈ విషయాన్ని కనుగొన్నవాడు విశ్వకర్మ అని సంకేతం. గ్రహాలు సూర్యునితోగల తమ కక్ష్యను సవరించుకొంటాయన్న విషయాన్ని ‘నాసా’ వారు కూడా అంగీకరించారు. విష్ణుచక్రమూ, శివుని త్రిశూలమూ ఘనపదార్థాలతో తయారైన వస్తువులు కావని, ఈనాడు ఆధునిక శాస్త్రజ్ఞులు కనిపెడ్తున్న లేజర్ వంటి కిరణాలతో తయారైన ఆయుధాలని అర్థం చేసుకోవాలి. మన పురాణగాథలను అర్థం చేసుకొనవలసిన విధానమిది అని ఒక మనవి.
వరిగొండ కాంతారావు
94418 86824