కోర్టు గదుల్లో మహిళా న్యాయవాదుల వస్త్రధారణ ఇబ్బందులు తీర్చేందుకు కేరళకు చెందిన ‘సేవ్ ది లూమ్’ సంస్థ వినూత్నమైన ఆలోచనచేసింది. ‘విధి’ పేరుతో 11 రకాల సరికొత్త చీరెలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
న్యాయవాదులు కోర్టు హాలులో ప్రవేశించాక కచ్చితంగా నల్లగౌను ధరించాల్సిందే. న్యాయస్థానం సమయం ముగిసేవరకూ ఆ గౌను ఒంటి మీద ఉండాల్సిందే. శీతకాలం అయితే ఫర్వాలేదు.. వేసవిలో మాత్రం చెమట, ఉక్కపోతకు ఇబ్బంది పడాల్సిందే. ఈ సమస్యకు పరిష్కారంగా పలువురు మహిళా న్యాయవాదుల సలహాలు, సూచనలు తీసుకొని.. కోర్టు గౌరవానికి భంగం కలుగకుండా నలుపు, తెలుపు వర్ణాల్లో చేనేత చీరెలను ప్రవేశపెట్టింది ‘సేవ్ ది లూమ్’ అనే సంస్థ. ‘విధి’ పేరుతో వచ్చిన ఈ సరికొత్త కలెక్షన్ మహిళా న్యాయవాదులకు బాగా నచ్చేస్తున్నదట. గోల్డ్, సిల్వర్ జరీ అంచుల చీరెలు, మ్యాచింగ్ బ్లౌజ్లు న్యాయవాదులు కానివారిని కూడా ఆకట్టుకుంటున్నాయి. అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఓ డ్రస్ కోడ్ ఏర్పాటు చేసింది. ఆ పరిధికి లోబడే వీటిని డిజైన్ చేశారు. భారతదేశపు తొలి మహిళా న్యాయవాది జస్టిస్ అన్నా చాందీ జయంతి సందర్భంగా ఈ చీరెలను ప్రారంభించారు. ఇవి పర్యావరణ హితమైనవి కూడా.