నిజామాబాద్, జూలై 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి):పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు అభివృద్ధి ఫలాలను అందించాయి. ప్రారంభ ఆర్భాటాలకే పరిమితం కాకుండా… ఆదర్శవంతంగా అమలయ్యాయి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు స్వయంగా పాల్గొని పర్యవేక్షించడంతో పది రోజుల కార్యక్రమం అట్టహాసంగా ముగిసింది. మౌలిక వసతులు మెరుగై ప్రజల ఇక్కట్లు తొలగిపోయాయి. అధికార యంత్రాంగమంతా పట్టణ, పల్లె బాట పట్టడంతో సందడి వాతావరణం ఏర్పడింది. గ్రామాల అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చేలా ఇరు జిల్లాల కలెక్టర్లు ప్రోత్సహించారు. ఫలితంగా నిజామాబాద్ జిల్లాలో రూ.1.08 కోట్లు, కామారెడ్డిలో రూ.1.38 కోట్ల మేర విరాళాలు రావడం విశేషం.
గ్రామాలకు వరంగా పల్లె ప్రగతి..
అభివృద్ధే లక్ష్యంగా చేపట్టిన పల్లె ప్రగతి పనులు గ్రామాలకు వరంగా మారాయి. మొక్కలు పెంచి జీవ వైవిధ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రకృతి వనాల లక్ష్యం నెరవేరింది. ప్రతి గ్రామంలో దాదాపుగా ఎకరానికిపైగా స్థలంలో వీటిని ఏర్పాటు చేసి వివిధ రకాల నీడనిచ్చే మొక్కలు, పండ్లు, పూలమొక్కల పెంపకంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. వనంలో తిరగడానికి వీలుగా వాకింగ్ ట్రాక్లు, కూర్చోవడానికి సిమెంట్ బెంచీలు, విద్యుద్దీపాలు, నీటి వసతి ఏర్పాటు చేశారు. గతంలో గ్రామాల్లో ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలు నిర్వహించేందుకు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రతి గ్రామానికి వైకుంఠధామాలను మంజూరు చేశారు. దీంతో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలాలను గుర్తించి, ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్మించారు. దహన వాటికలు, స్నానాల గదులు, నీటి సౌకర్యం, పురుషులకు, స్త్రీలకు వేర్వేరుగా మరుగుదొడ్లు, మూత్రశాలలు వంటి సదుపాయంతో నిర్మించారు.
క్లీన్ అండ్ గ్రీన్..
పల్లె, పట్టణ ప్రగతిలో ప్రధానంగా రహదారులు, మురుగు కాలువలు, ఖాళీ స్థలాలను శుభ్రం చేయించారు. ఖాళీ స్థలాల్లో, రహదారులు, వీధులకు ఇరువైపులా మొక్కలు నాటారు. శిథిలావస్థకు చేరిన ఇండ్లను కూల్చివేయడం, ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభాలు, తీగలు తొలగించేందుకు ప్రతిపాదించడం, వీధి దీపాల ఏర్పాటు, రహదారుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి అమలు చేయడం, నీటి లీకేజీలు అరికట్టడం, పని చేయని బోరు బావులు, బావులను పూడ్చివేయడం, అవసరమైన చోట్ల మరుగుదొడ్లు నిర్మించడం, మెరుగైన నిర్వహణకు చర్యలు తీసుకోవడం వంటివి చేపట్టారు.
తీరిన చెత్త సమస్య..
గ్రామాల్లోని చెత్తను ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లి డంపింగ్ యార్డులో వేయడంతో వీధులు శుభ్రంగా మారుతున్నాయి. కంపోస్ట్ షెడ్లు నిర్మించి ఎరువుల తయారీకి సన్నాహాలు చేస్తున్నారు. చెత్త తొలగింపునకు ఇతర అవసరాలకు ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్, నీటి ట్యాంకర్ను కొనుగోలు చేశారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు గతంలో మండలానికి నాలుగైదు నర్సరీలు మాత్రమే ఉండేవి. వాటి ద్వారా పూర్తిస్థాయిలో మొక్కలు లభ్యమయ్యేవి కావు. దీంతో ప్రభుత్వం ఊరూరా నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలు పెంపకానికి శ్రీకారం చుట్టింది. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో వేయికి పైగా నర్సరీలు పురుడు పోసుకున్నాయి.
గ్రామాల్లో వెల్లువెత్తిన విరాళాలు
దాతలు తమ ఊరి మేలు కోసం కదిలి వచ్చారు. డొనేషన్ డేను ప్రత్యేకంగా నిర్వహించడంతో చాలా మంది అధికారుల పిలుపును అందుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో 10 రోజుల్లో 1105 మంది దాతలు వివిధ రూపాల్లో ప్రభుత్వానికి విరాళాలు అందించారు. వీటి మొత్తం కోటీ 8లక్షల 47,835 రూపాయలుగా ఉంది. వీటిలో వైకుంఠరథాలు, మృతదేహాలు భద్రపరిచే ఫ్రీజర్లు, బెంచీలు, కుర్చీ లు, కంప్యూటర్లు, ఇతరత్రా సామగ్రి ఉంది. కామారెడ్డి జిల్లాలో కోటీ 38లక్షల 4,053 రూపాయలు విరాళాల ద్వారా పోగైంది. వీరందరికీ ఆయా జిల్లా యంత్రాంగం సత్కారాలతో గౌరవించింది. పట్టణాల్లో మాత్రం కొద్దిమంది మాత్రమే విరాళాలు అందించారు.