‘ఏయ్ త్రీనాట్ ఫోర్! ఆ సెల్లోకి కొత్తగా వచ్చిన వారి సంగతి కాస్త చూడు!’
‘వన్నాట్ వన్! సెల్ నంబర్ ఫోర్లో వేడివేడిగా నాలుగు వడ్డించండి!’
అబ్బే ఖైదీలు కాదు.. ఊచలు లెక్కిస్తూ ఆహారం ఆస్వాదించడానికి వచ్చిన అతిథులు వాళ్లంతా!
కటకటాల్లో ఉన్నవారికి చిటికెలో ఆర్డర్ సప్లయ్ చేసే వెయిటర్లు వీళ్లంతా!!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏజెన్సీలో జైలు రెస్టారెంట్ కబుర్లివి..
మణుగూరు ఏజెన్సీలో కొత్తగా మొదలైంది.. వాసవి ఫ్యామిలీ రెస్టారెంట్. పైకి సాధారణంగా కనిపించినా, లోపలికి అడుగుపెడితే అచ్చంగా జైలులాగే ఉంటుంది. మణుగూరుకు చెందిన వాసు ఓ రెస్టారెంట్ ప్రారంభించాలనుకున్నారు. అందుకు, మెట్రో నగరాల్లోని థీమ్ రెస్టారెంట్ ఫార్ములాను ఎంచుకున్నారు. ‘జైలు’ థీమ్తో ఏజెన్సీలో కొత్త పోకడకు తెరలేపారు. రెస్టారెంట్లో నాలుగు లాకప్లు కట్టించారు. సెల్లోపల ఓ కుటుంబం ప్రశాంతంగా కూర్చొని తినేలా సౌకర్యాలు కల్పించారు. ఇటుకలు కనబడేలా గోడలు, కటకటాలు, మధ్యలో లైటు, కటకటాల ద్వారం ఇలా జైలు గదిని తలపించేలా ప్రత్యేకంగా డిజైన్ చేయించారు.
రాగానే సెల్ లోకి..
ఈ రెస్టారెంట్కు వచ్చి ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఖాళీగా ఉన్న సెల్లో కస్టమర్లను వేసేస్తారు. లాక్ చేసి, భోజనం అయ్యేంత వరకూ అందులోనే ‘బంధించి’ భోజనం పెడతారు. లాకప్ లోపలి నుంచే ఆర్డర్ చేయాలి. ఈ కాన్సెప్ట్ కొత్తగా ఉండటంతో మణుగూరు వాసులు ‘జైలు కూడు’ కోసం క్యూ కడుతున్నారు. ఈ రెస్టారెంట్లో ఇంకో వెసులుబాటు కూడా ఉంది.. లాకప్ భోజనం ఇష్టంలేని వారిని సెపరేట్గా కూర్చోబెట్టి నచ్చిన వంటకాలు వడ్డిస్తున్నారు.
200 రకాలు!
లాకప్ భోజనం మరింత రుచికరంగా ఉండాలని ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి షెఫ్లను తీసుకొచ్చారు వాసు. మణుగూరు, కొత్తగూడెం, భద్రాచలం భోజన ప్రియులు ఇంతవరకు రుచిచూడని చికెన్మండి, మటన్ మండి వంటి వివిధ రుచులతో పాటు చేపల బిర్యానీ, రొయ్యల బిర్యానీ, రకరకాల వేపుళ్లు, అనేకానేక కూరలు వండి వడ్డిస్తున్నారు. మెట్రో నగరాల్లో దొరికే 200 రకాల వెజ్, నాన్వెజ్ వంటకాలు అందుబాటులో ఉంచారు. నెలలో రెండుసార్లు సముద్ర ప్రాంతాల చేపలతో స్పెషల్ డిష్లు వండిస్తున్నారు.
… శ్యామ్ మిట్టపల్లి, మణుగూరు