మెట్ల బావులు అనగానే ఏ రాజస్థానో, గుజరాతో గుర్తుకొస్తాయి. అంతకు పది మెట్లు పైనున్న బావులు తెలంగాణలో అనేకం. నారాయణపేట జిల్లాలోని మెట్ల బావులను ప్రభుత్వ సహకారంతో ‘ద రెయిన్ వాటర్ ప్రాజెక్ట్’ సంస్థ పునరుద్ధరిస్తున్నది. నిన్నటి వరకూ పాడుబడిన ఆ బావులే ఇప్పుడు బతుకమ్మ సంబురాలకు వేదికలు అవుతున్నాయి.
ఇప్పటికే.. నారాయణపేటలోని బారంబావి, ఎక్లాస్పూర్ పంచాయతీ పరిధిలోని ఏనుగుల బావి, ధన్వాడలోని వేంకటరమణ బావులకు పూర్వవైభవం వచ్చింది. బారంబావి వద్ద జరుగుతున్న బతుకమ్మ వేడుకలకు వందలాది జనం తరలివస్తున్నారు. నిత్యం సాంస్కృతిక కార్యక్రమాలూ జరుగుతున్నాయి. ‘బారా’ అంటే హిందీలో పన్నెండు. డజను బావుల లోతు ఉండటం వల్లే దీనికా పేరు వచ్చిందని అంటారు. ఎక్లాస్పూర్ సమీపంలోని ఏనుగుల బావిని లోకాయపల్లి సంస్థాన మహారాణి లక్ష్మమ్మ నిర్మించారు. ఆ రోజుల్లో ఏనుగులు నేరుగా బావిలోకి వెళ్లి నీరు తాగేవని అంటారు. అందుకే ‘ఏనుగుల బావి’ అన్న పేరు వచ్చిందనీ చెబుతారు. వేంకటరమణ బావిని కూడా లక్ష్మమ్మ రాణెమ్మ హయాంలోనే నిర్మించినట్టు తెలుస్తున్నది. ‘మెట్ల బావి వద్ద బతుకమ్మ సంబురాలు జరుపుకోవడం మరచిపోలేని అనుభూతి. జిల్లాలో మొత్తం 40 మెట్ల బావులున్నాయి. మిగిలిన వాటికి కూడా పూర్వ వైభవం తీసుకొస్తాం’ అంటున్నారు నారాయణపేట
కలెక్టర్ హరిచందన.