మనసు హుషారుగా ఉంటే చాలు. వయసుతో సంబంధం లేకుండా ఎన్నో రంగాల్లో రాణించవచ్చు. ఇదే విషయాన్ని అక్షరాలా రుజువు చేసింది ముంబైకి చెందిన 62 ఏండ్ల వృద్ధురాలు రవిబాల శర్మ. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో మ్యూజిక్ టీచర్గా పని చేసి 2019లో రిటైర్ అయింది. తర్వాత ముంబైలో కొడుకు ఏకాన్ష్ దగ్గర స్థిరపడింది. సితార్, తబలా, కథక్లలో నిష్ణాతురాలైన ఈ బామ్మ చక్కగా పాటలూ పాడుతుంది.
2020 జూన్లో రవి పిల్లలు ఆమె పేరుమీద సోషల్ మీడియాలో ఒక అకౌంట్ క్రియేట్ చేశారు. ఏకాన్ష్ ఒకరోజు వాళ్లమ్మను డ్యాన్స్ చేయమని కోరాడు. దాన్ని వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాడు. ఆ వీడియోను చాలామంది చూశారు. కామెంట్లు, షేర్లతో వీడియో వైరల్ అయింది. నెటిజన్ల నుంచి వచ్చిన రియాక్షన్ చూసిన రవిబాల సంతోషం పట్టలేక పోయింది. తర్వాత వారానికో వీడియాను అప్లోడ్ చేయడం మొదలుపెట్టింది. కొవిడ్ పాజిటివ్ వచ్చిన కొన్ని రోజులు మాత్రం దాదీ బ్రేక్ తీసుకుంది. వహీదా రెహమాన్ నుంచి దిల్జీత్ దోసాంజ్ వరకు అందరి పాటలకూ బామ్మ డ్యాన్స్ చేసింది. ఆగస్టు నెలలో ఆమె వీడియోని ఏకంగా దోసాంజ్ కూడా రీపోస్ట్ చేశారు. గాగ్రా డ్రెస్తో మాధురీ దీక్షిత్ డ్యాన్స్ చేశాక ఆమె ఫాలోవర్స్ మరింత పెరిగిపోయారు. ‘చిన్నప్పుడు నాకు డ్యాన్స్ చేయడమంటే చాలా ఇష్టం. కానీ, నాన్నకు నచ్చేదికాదు. ఇప్పుడు నా పిల్లలవల్ల ఆ కోరిక తీరింది. అందరూ డ్యాన్సింగ్ దాదీ అని ప్రేమగా పిలుస్తున్నారు’ అని సంతోషంగా చెబుతున్నది రవి బామ్మ!