న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: ఐటీ దిగ్గజాల్లో ఒకటైన టెక్ మహీంద్రా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.1,081.40 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం నమోదైన రూ.803.90 కోట్ల లాభంతో పోలిస్తే 34.6 శాతం అధికం. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 2.5 శాతం పెరిగి రూ.9,490.20 కోట్ల నుంచి రూ.9,729.90 కోట్లకు ఎగబాకింది. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.37,855 కోట్ల ఆదాయంపై రూ.4,428 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. మరోవైపు గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.15 ప్రత్యేక డివిడెండ్ను కలుపుకొని రూ.30 తుది డివిడెండ్ను సంస్థ ప్రకటించింది. ఈ డివిడెండ్ చెల్లింపులకు వాటాదారులు అనుమతించాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే అమెరికాకు చెందిన కన్సల్టింగ్ అండ్ టెక్నాలజీ సేవల సంస్థయైన ఈవెంట్యూస్ సొల్యుషన్ గ్రూపును కొనుగోలు చేసినట్లు టెక్ మహీంద్రా ప్రకటించింది. దీంతో కన్సల్టింగ్ విభాగం మరింత బలోపేతం అవడంతోపాటు యూఎస్లో వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి విలుపడనున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. మార్చి చివరి నాటికి సంస్థలో 1,21,054 మంది విధులు నిర్వహిస్తున్నారు.