తేనె.. రుచిలో పోటీలేనిది, ఔషధంగా సాటిలేనిది. సౌందర్య సాధనంగానూ తిరుగులేనిది. కానీ, పెరిగిపోయిన వినియోగం తేనె చిక్కదనాన్ని చిక్కేలా చేసింది. లాభాపేక్షతో రసాయనాలు కలిపి హనీని కాస్తా, హానికారకంగా మార్చేస్తున్నాయి మార్కెట్ శక్తులు. ప్రజలకు శుద్ధమైన తేనె అందించాలనే లక్ష్యంతో ఈ ‘తీయని’ వ్యాపారంలోకి దిగారు హైదరాబాద్కు చెందినమహిళా రైతు కుడుముల ఇందిరారెడ్డి. తేనెటీగలు పువ్వు కందిపోకుండామకరందాన్ని గ్రోలినట్టు, స్వచ్ఛతకు భంగం వాటిల్లకుండా తేనెను సంగ్రహిస్తున్నారామె. నేడు ‘జాతీయ తేనెటీగల దినోత్సవం’. ఈ సందర్భంగా ఇందిరారెడ్డి విజయ ప్రస్థానం..
పంచదార కన్నా, బెల్లం పాకం కన్నా రుచికరమైంది తేనె. పూలోతుల్లో నిక్షిప్తమైన మకరందం, తేనెటీగ తాకగానే రుచికరంగా మారిపోతుంది. ఔషధ గుణాలను సంతరించుకుంటుంది. మోవిపై చేరిన తేనె చుక్క జిహ్వాగ్రానికి తాకగానే మోక్షంకన్నా రంజుగా ఉందనిపిస్తుంది. శరీర బరువు పెరగాలంటే తేనె, తగ్గాలన్నా తేనే! ఉష్ణం చేస్తే ఊరట తేనె, పడిశం పడితే విరుగుడు తేనె.. చెబుతూపోతే ఈ ప్రకృతి ప్రసాదం సర్వరోగ నివారిణి. అయితే పూర్వం అడవుల్లో మాత్రమే లభించిన తేనె ఇప్పుడు పెరట్లోనూ సిద్ధమవుతుంది. చెక్కపెట్టెల్లో ఫ్రేములు అమర్చి, తేనెటీగలను మచ్చిక చేసుకొని, వాటిని పూబాలలతో అచ్చికలాడించి పసందైన తేనె తయారు చేయడం ఇప్పుడో జీవనోపాధి. కృత్రిమ పద్ధతుల్లో తేనె తయారీని లాభదాయక వ్యాపారంగా మార్చుకున్నారు ఇందిరారెడ్డి.
ఇంటి దగ్గరే ప్రాసెసింగ్
ఐదేండ్లుగా తేనెటీగల పెంపకంలో ఉన్నారు ఇందిరారెడ్డి. మొదట అయిదు పెట్టెలతో తేనె ఉత్పత్తిని ప్రారంభించారు. ఇప్పుడు 250 పెట్టెలతో ఏడాది పొడవునా తేనె పరిశ్రమను నిర్వహిస్తున్నారు. నల్లగొండ జిల్లా నిడమనూరు గుంటిపల్లి-వేంపాడు గ్రామాల మధ్య 70 ఎకరాల బత్తాయితోటలో ఈ పెట్టెలను ఏర్పాటు చేశారు. పంటలు పూతదశలో ఉన్న చోటికి ఈ తేనె పెట్టెలను తరలిస్తుంటారు. ఏడాదికి ఎనిమిది నెలలపాటు శ్రమించి దాదాపు 1260 కిలోల తేనెను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ తేనెను హైదరాబాద్లోని ఇంటిదగ్గరే ప్రాసెస్ చేస్తున్నారు. కిలో తేనె రూ.600లకు విక్రయిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు కూడా. అంతేకాదు, నల్లగొండ జిల్లాలో రైతులకు, నిరుద్యోగులకు తేనె ఉత్పత్తిపై శిక్షణ ఇస్తున్నారు.
అధిక దిగుబడి
365 రోజులూ తేనె ఉత్పత్తి చేసేలా ప్రణాళిక అమలుచేస్తున్నారు ఇందిర. ‘పలు రకాల పంటలు తేనె ఉత్పత్తికి అనుకూలంగా ఉంటాయి. అందుకు అనుగుణంగా సంగారెడ్డి జిల్లాలో పొద్దుతిరుగుడు, వికారాబాద్లో వాము, నల్లగొండ జిల్లాలో బత్తాయి, మామిడి, నిమ్మ తోటల్లో తేనె ఉత్పత్తి చేస్తున్నాం. అయితే, చాలామందికి తేనెటీగల పెంపకంపై అపోహలు ఉన్నాయి. వాటి వల్ల పంట దిగుబడి తగ్గిపోతుందని భయపడతారు. కానీ, తేనెటీగలు వర ప్రదాతలు. వీటి పెంపకం వల్ల పంట దిగుబడి పెరుగుతుంది. అదనపు ఆదాయమూ సమకూరుతుంది’ అని చెబుతారు ఇందిరారెడ్డి. ప్రస్తుతం గిరాకీకి అనుగుణంగా తేనె ఉత్పత్తి జరగడం లేదు. పల్లె, పట్నం అన్న తేడాలేకుండా తేనె వాడకం పెరిగింది. సౌందర్య ఉత్పత్తులు, ఔషధాల్లోనూ వినియోగం అధికమైంది. ఈ నేపథ్యంలో తేనె తయారీ పరిశ్రమను నెలకొల్పిన వాళ్లకు నష్టమనే ప్రసక్తి ఉండదని చెబుతున్నారు ఇందిరారెడ్డి. తేనెటీగల పెంపకం ద్వారా ఆర్థికంగా వృద్ధిలోకి రావడంతోపాటు ప్రకృతికీ మేలు చేసినవాళ్లం
అవుతామని అంటున్నారు.
స్థిరంగా ఆదాయం
ఒక బాక్స్ ద్వారా నెలకు 2 కిలోల తేనె ఉత్పత్తి అవుతుంది. ఐదు బాక్సులు ఏర్పాటు చేసుకుంటే పది కిలోలు. ఏడాదికి ఐదు బాక్స్ల నుంచి దాదాపు 120 కిలోలు తేనె లభిస్తుంది. కిలో రూ.600 చొప్పున ఏడాదికి రూ.72,000 ఆదాయం సమకూరుతుంది. బాక్సుల సంఖ్య పెరిగే కొద్దీ ఆదాయం పెరుగుతున్నట్టే.
… మజ్జిగపు శ్రీనివాస్రెడ్డి