వర్షకాలంలో, చలికాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతుంటాయి. ఇవి పెద్దగా ప్రమాదకరం కాదు కానీ, గర్భిణులపై తీవ్ర ప్రభావం చూపే ఆస్కారం ఉంది. ప్రారంభంలోనే గుర్తిస్తే సాధారణ చికిత్సతోనే నయం అవుతాయి. నిర్లక్ష్యం చేస్తే మాత్రం తల్లీబిడ్డలకు ప్రమాదమే. వానలు పెరిగేకొద్దీ, చలి ముదిరేకొద్దీ గర్భిణులకు ఇబ్బందులు ఆరంభం అవుతాయి. సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు సాధారణ వ్యక్తుల్లా గర్భిణులు ఏ మందులు పడితే ఆ మందులు తీసుకోకూడదు. వైద్యుల పర్యవేక్షణలోనే ఔషధాలు వాడాలి. అందులోనూ ఈ కరోనా కాలంలో నిర్లక్ష్యం పనికిరాదు. ముందుగా అవి సీజనల్ రుగ్మతలా, కరోనా లక్షణాలా అన్నది నిర్ధారించుకోవాలి. సీజనల్ వ్యాధులుగా భావించిన కేసుల్లోకూడా కొన్నిసార్లు కొవిడ్ బయటపడుతుంది. మరికొన్నిసార్లు డెంగ్యూగా కూడా నిర్ధారణ కావచ్చు.
సాధారణ మహిళలతో పోలిస్తే గర్భిణులలో రోగ నిరోధక శక్తి తక్కువే. దీనివల్ల ఇన్ఫెక్షన్స్, సీజనల్ వ్యాధులు సోకే ఆస్కారం అధికం. అందుకే, పౌష్ఠి
కాహారం తప్పనిసరి. విటమిన్ సప్లిమెంట్స్ వాడాలి. డెంగ్యూ, డయేరియా, కామెర్ల వంటి వ్యాధులు తీవ్ర ప్రభావం చూపుతాయి. తల్లీబిడ్డలకు ప్రమాదకరంగానూ పరిణమిస్తాయి. డెంగ్యూవల్ల ప్లేట్లెట్స్ పడిపోతాయి. ప్రసవ సమయంలో ఇది మరీ ప్రమాదకరం. బిడ్డకు కామెర్లు సోకే ప్రమాదమూ ఉంది. డెంగ్యూ, మలేరియా, డయేరియా వంటి వ్యాధుల వల్ల తీవ్ర జ్వరం, వాంతులు, విరేచనాలు అవుతాయి. దీనివల్ల డి-హైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ పరిస్థితి కడుపులోని బిడ్డనూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మూడు నెలల్లోపు గర్భిణులు సీజనల్ వ్యాధుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యం చేస్తే అబార్షన్ కావచ్చు. ఈ దశలో హై ఫీవర్, లూజ్ మోషన్స్ తదితర సమస్యలు గర్భ విచ్ఛిత్తికి దారితీయవచ్చు. ఈ సమస్యకు ఒకటే పరిష్కారం. సకాలంలో చికిత్స అందించాలి. గర్భిణి డి-హైడ్రేషన్కు గురికాకుండా చూడాలి. తగిన సమయంలో ఫ్లూ వ్యాక్సిన్ ఇప్పించాలి. సాధారణంగా నాలుగో నెలలో ఇన్ఫ్లుయంజా(ఫ్లూ) వ్యాక్సిన్ ఇస్తారు.
డాక్టర్ కె.శిల్పిరెడ్డి
కిమ్స్ కడల్స్ – మదర్ అండ్ చైల్డ్ సెంటర్
కొండాపూర్