గౌహతి : కొవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసులు అందుకున్న ఉద్యోగులు సోమవారం నుండి కార్యాలయాల్లో విధుల్లో చేరాల్సిందిగా అసోం ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కమిషనర్, సెక్రటరీ ఎం ఎస్ మణివన్నన్ ఉత్తర్వు జారీ చేశారు. ప్రభుత్వ కార్యకలాపాలు సజావుగా పనిచేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. విధుల్లో చేరేటప్పుడు ఉద్యోగులు ప్రభుత్వం జారీ చేసిన అన్ని కొవిడ్ సంబంధిత నియమాలను పాటించాలన్నారు.
కొవిడ్ కేసుల పెరుదల కారణంగా జూన్ 4న అసోం ప్రభుత్వం పాక్షిక లాక్డౌన్ను మరోసారి పొడిగించింది. జూన్ 15 వరకు లాక్డౌన్ను పొడిగిస్తూ నిర్ణయం వెలువరించింది. ఈ సమయంలో మధ్యాహ్నం ఒంటి గంట నుండి మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటల వరకు ప్రజల కదలికలపై పూర్తి నిషేధం ఉంటుంది. వ్యాపార సముదాయాలు మధ్యాహ్నం 12 గంటల వరకే నిర్వహించుకునేందుకు వెసులుబాటు.