జీవితం నేర్పే పాఠాలను ప్రపంచానికి చెప్పడానికి వృద్ధాప్యమే రానక్కర్లేదు. మాన్సీ చౌదరి అనే టీనేజ్ అమ్మాయి ఇందుకు ఉదాహరణ. మాన్సీ జార్ఖండ్లోని రాంచీకి చెందిన 19 ఎండ్ల యువతి. కరోనా వచ్చిన దగ్గరనుంచి పూర్తిగా తగ్గిపోయి తిరిగి తన కుటుంబంతో కలిసేవరకూ ప్రతి క్షణానికీ అక్షరరూపం ఇచ్చింది. దాని పేరే ‘వన్ మంత్ స్టోరీ’. మాన్సీ పుస్తకం అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ వెబ్సైట్స్లో హాట్ కేక్లా అమ్ముడవుతున్నది. రాంచీలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్స్ చేస్తున్న మాన్సీది ఉమ్మడి కుటుంబం. ఇంట్లో దాదాపు 18 మంది ఉంటారు. ఆమెకు ‘పాజిటివ్’ అని తెలియగానే, ప్రత్యేక గదిలో ఉంచారు. ఖాళీగా ఉండటం ఇష్టం లేని మాన్సీ పెన్ను, డైరీ తీసుకొని రోజూ తన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చింది. ఆమె తన కథను చెప్పిన తీరు నచ్చిన నోట్ ప్రెస్ ప్రచురణ సంస్థ ఇంగ్లిష్, హిందీ భాషల్లో ముద్రించింది. ఈ పుస్తకాన్ని చదివిన వాళ్లు మంచి రివ్యూలు ఇవ్వడంతో ‘వన్ మంత్ స్టోరీ’కి డిమాండ్ పెరిగింది.