న్యూఢిల్లీ, మే 30: దేశంలో కరోనా కేసుల ఉద్ధృతి తగ్గుతున్నప్పటికీ, ముందస్తు కట్టడి చర్యల్లో భాగంగా పలు రాష్ర్టాలు లాక్డౌన్ను పొడిగిస్తూ ఆదివారం నిర్ణయం తీసుకున్నాయి. కొన్ని రాష్ర్టాలు మాత్రం ఆంక్షల్లో మినహాయింపులను ఇచ్చాయి. కేరళలో లాక్డౌన్ను జూన్ 9 వరకు పొడిగించారు. అయితే, 50 శాతం మంది ఉద్యోగులతో పనిచేయడానికి పరిశ్రమలకు అనుమతిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మహారాష్ట్రలో జూన్ 15 వరకు లాక్డౌన్ తరహా ఆంక్షలు కొనసాగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. పశ్చిమబెంగాల్లో జూన్ 15 వరకు ఆంక్షలు కొనసాగుతాయని సర్కార్ ప్రకటించగా, రాజస్థాన్లో జూన్ 8 వరకు లాక్డౌన్ను పొడిగించారు. ఒడిశాలో వచ్చే నెల 17, తమిళనాడు, పుదుచ్చేరి, హర్యానాలో వచ్చే నెల 7 వరకు, నాగాలాండ్లో వచ్చే నెల 11 వరకు లాక్డౌన్ను పొడిగించారు. కర్ణాటకలో ప్రస్తుతం అమలవుతున్న లాక్డౌన్ను జూన్ 30 దాకా కొనసాగించాలని ఆ రాష్ట్రప్రభుత్వం భావిస్తున్నది. రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న లాక్డౌన్ వచ్చే నెల 7న ముగియనుంది. మధ్యప్రదేశ్లో వారాంతపు లాక్డౌన్ కొనసాగనుంది. ఇదే సమయంలో వచ్చే నెల 1 నుంచి దశలవారీగా అన్లాక్ ప్రక్రియ ప్రారంభంకానుంది.