ఆమె చిరునామా పేదరికం! అయితేనేం, ఇప్పుడు పేదలకు పెద్దదిక్కుగా నిలుస్తున్నది. ‘ఆడపిల్లకు చదువు ఎందుకు?’ అని ప్రశ్నించిన వాళ్లతోనే ‘శభాష్’ అనిపించుకుంటున్నది. తోటివారికి సాయం చేయాలన్న సంకల్పంతో రేయింబవళ్లు కష్టపడుతున్నది. స్నేహితులతో కలిసి ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నది మిర్యాలగూడకు చెందిన 23 ఏండ్ల నిలోఫర్ తబస్సుమ్. అడుగడుగునా ఎదురైన సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్న ఈ యువతి ‘జిందగీ’తో పంచుకున్న అనుభవాలు..
నిలోఫర్ వస్తుందంటే చాలు, బస్తీ పిల్లలు కుస్తీలు ఆపేసి చుట్టూ చేరిపోతారు. కిస్తీలు కడుతున్న పెద్దమ్మ ‘రా తల్లీ!’ అని ఆప్యాయంగా ఆహ్వానిస్తుంది. రెండు నిమిషాల్లో గల్లీలోని అమ్మలక్కలందరూ నిలోఫర్ చుట్టూ మూగుతారు. తమ సమస్యలు చెప్పుకొంటారు. ఆమె చెప్పే పరిష్కారాలు శ్రద్ధగా వింటారు. ఆ సలహాలను పాటిస్తారు. ఇందరి సమస్యలూ తీరుస్తున్న నిలోఫర్ నిజాం కోడలో, బంధువో కాదు. ఓ సాధారణ మహిళ. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆడకూతురు.
పెండ్లి గండం దాటుకొని..
నిలోఫర్కు బాల్యంలోనే వివక్ష గురించి తెలుసు. రోజూ ఉదయం తయారై తమ్ముడితో బడికి బయల్దేరేది. మధ్యలో ఇద్దరి దారులూ వేరుపడేవి. తమ్ముడు ప్రైవేట్ బడికి వెళ్లేవాడు. తనేమో సర్కార్ స్కూలుకు వెళ్లేది. ఉర్దూ మీడియం ప్రభుత్వ పాఠశాలలో చదివేది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వాళ్ల ఊరు. తండ్రి ఎండీ జాన్కు సూర్యాపేటలో దుకాణం ఉండేది. నష్టాలు రావడంతో మిర్యాలగూడలోనే చిన్న వ్యాపారం చేసేవాడు. కూతురు పదో తరగతికి వచ్చేసరికి, సంబంధాల వేటలో పడ్డాడు తండ్రి. ఓ రోజు తల్లిదండ్రులు తన పెండ్లి గురించి చర్చించుకోవడం చూసి రాత్రంతా కన్నీళ్లు పెట్టుకుంది. మర్నాడు ధైర్యం చేసి తనకు పెండ్లొద్దనీ, ఇంకా చదువుకుంటాననీ చెప్పింది. మొత్తానికి పెండ్లి గండం తప్పింది. పదో తరగతిలో 523 మార్కులు సాధించి శభాష్ అనిపించుకుంది.
గడప దాటి..
అన్ని మార్కులు సాధిస్తే ఏం లాభం, ఇంటర్ చదవాలంటే మరో గండం. తనకేమో లెక్కలంటే ఇష్టం. కానీ, వాళ్ల ఊళ్లో ఊర్దూ మీడియం కాలేజీలో హెచ్ఈసీ గ్రూప్ ఒక్కటే ఉండేది. నల్లగొండలో అయితే ఎంపీసీ, బైపీసీ చదవొచ్చు. ఆ మాటే తండ్రికి చెప్పింది. నల్లగొండ పంపించమంది. ఇంట్లో ససేమిరా అన్నారు. చేసేది లేక మిర్యాలగూడలోనే ఇంటర్ చేసింది. తర్వాత డిగ్రీ చేయాలి. బాగా చదువుకొని, మంచి ఉద్యోగం చేయాలన్నది తన కల. ‘జాబ్ చేసి ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలనుకునేదాన్ని. ఇంటర్లో ఉన్నప్పుడే, ఉర్దూ మీడియం వాళ్లకు భవిష్యత్లో ఎలాంటి అవకాశాలు ఉంటాయో వెతికేదాన్ని.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)లో మాకు డిగ్రీ, పీజీ కలిపి ఐదేండ్ల కోర్సు ఉందని తెలుసుకున్నాను. అలాగే, రెండేండ్ల టీటీసీ కోర్సు కూడా చేయొచ్చని తెలిసింది. వాటి ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాస్తే, రెండిట్లో సీటు వచ్చింది’ అంటూ పాత విషయాలు గుర్తు చేసుకున్నది నిలోఫర్. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది. చేతికి అందిన అవకాశాలు చేజారి పోయాయి. టీటీసీ చేయాలన్న ఆశ తీరలేదు. హెచ్సీయూలో అడుగుపెట్టాలన్న కలా నెరవేరలేదు. మరొకరైతే నిరాశలో కూరుకుపోయేవారు.
భాగ్యనగరిలో ఒంటరి
దారి మూసుకుపోయినా పట్టుదల వీడలేదు నిలోఫర్. డిగ్రీకోసం హైదరాబాద్కు రావాలనుకుంది. ఇంట్లో అస్సలు ఒప్పుకోలేదు. ‘నా స్నేహితురాలు ఒకమ్మాయి నాతో కలిసి చదువుకుంటుందని తెలిసి సరేనన్నారు. కానీ, తను టీటీసీ కోసం వరంగల్ వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు, ఇంట్లోవాళ్లను ఎంతగానో బతిమాలితే హైదరాబాద్కు పంపారు. కానీ, ఆర్థికంగా సాయం చేయలేమన్నారు. ‘మూడు నెలలు మాత్రమే డబ్బు పంపండి. తర్వాత ఏదైనా జాబ్ చేస్తూ చదువుకుంటాను’ అన్నాను. మొత్తానికి 2013లో హైదరాబాద్లో అడుగుపెట్టా. నాన్న షేక్పేట్ దగ్గర హాస్టల్లో చేర్పించి కన్నీళ్లతో ఇంటికి వెళ్లారు’ అని గుర్తు చేసుకుంది నిలోఫర్.
చదువుతూనే సేవ
డిగ్రీ చదువు ఆమె దృక్పథాన్ని మార్చేసింది. తనకు సరికొత్త లక్ష్యాన్ని నిర్దేశించింది. తక్కువ ఖర్చులో చదువుకోవాలనే సంకల్పంతో వెతకగా, వెతకగా ఆమెకు బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్ కనిపించింది. అదైతే పార్ట్టైమ్ జాబ్కూడా చేసుకోవచ్చని భావించింది. అలా హైటెక్సిటీ దగ్గర్లో రోడా మిస్ట్రీ కాలేజ్ ఆఫ్ సోషల్ వర్క్ అండ్ రీసెర్చ్ సెంటర్లో డిగ్రీలో చేరింది. మూడు నెలలు ఉద్యోగాల కోసం ప్రయత్నించింది. మెక్డొనాల్డ్స్లో వెయిటర్ ఉద్యోగానికి శిక్షణ కోసం వెళ్లింది. కానీ, నచ్చక వద్దనుకుంది. తన స్కాలర్షిప్ డబ్బులు పెట్టి ల్యాప్టాప్ కొనుక్కుంది.
టైపింగ్ జాబ్వర్క్ చేస్తూ సంపాదించడం మొదలు పెట్టింది. ‘చదువుకుంటూనే వి చేంజ్ అనే స్వచ్ఛంద సంస్థలో వలంటీర్గా చేరాను. హైదరాబాద్లోని పాతబస్తీలో తిరుగుతూ అవగాహనా సదస్సులు నిర్వహించేదాన్ని. ఒక్కో సెషన్కు రూ.500 ఇచ్చేవాళ్లు. నా చదువు కూడా సోషల్ వర్క్ కావడంతో ఈ పనిమీద ఆసక్తి పెరిగింది. రకరకాల వ్యక్తులను కలిసే అవకాశం వచ్చింది. సమాజం మీద అవగాహనా పెరిగింది’ అని చెప్పింది నిలోఫర్.
‘గుడ్ యూనివర్స్’ ఏర్పాటు
డిగ్రీలో వారానికి రెండు రోజులు ఫీల్డ్ వర్క్ ఉండేది. ఆ సమయంలో బాల్రెడ్డినగర్ అనే మురికివాడకు వెళ్తుండేది నిలోఫర్. “అక్కడి ప్రజలతో మాటలు కలిపి, వారితో మమేకం అవ్వడానికి మూడు వారాలు పట్టింది. పరిసరాల పరిశుభ్రతపై జనానికి అవగాహన కల్పించేదాన్ని. పోషకాహార ప్రాధాన్యం వివరించేదాన్ని. వాళ్లూ బాగా వినేవారు. ఎన్జీవోల సాయంతో కొన్ని సదుపాయాలూ కల్పించేవాళ్లం. ఇదే సమయంలో, నా టీమ్ మెంబర్ కమల్తో కలిసి ఒక ఎన్జీవో స్థాపించి నలుగురికీ సాయం చేయొచ్చు కదా! అన్న ఆలోచన వచ్చింది.
అప్పటికింకా డిగ్రీ సెకండ్ ఇయర్కూడా కాలేదు. ‘అయితేనేం నలుగురికీ సాయం చేయడానికి అనుభవంతో పనేముంది? మంచి మనసు ఉండాలి కానీ’ అనుకున్నాం. ‘గుడ్ యూనివర్స్’ అనే సంస్థను ప్రారంభించాం” అంటుంది నిలోఫర్. గుడ్ యూనివర్స్ నేతృత్వంలో దాతల సాయంతో అనేక సామాజిక కార్యక్రమాలు చేసిందామె. మరోవైపు డిగ్రీతోపాటు పీజీకూడా చేసింది. సంస్థ తరఫున పలు ప్రాజెక్టులు నిర్వహిస్తూ వచ్చిన ఆదాయాన్ని ఎన్జీవో నిర్వహణకు ఖర్చు చేస్తున్నది. తమ సంస్థ పనితీరు సంతృప్తికరంగా ఉందని చెబుతున్నది నిలోఫర్.
ఆడవాళ్లకు అండగా..
నెలసరి పరిశుభ్రతే లక్ష్యంగా గ్రామాల్లో పర్యటించి ఎన్నో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాం. నెలసరిలో వాడే ప్లాస్టిక్ శానిటరీ ప్యాడ్స్తో కలిగే నష్టాలను చెబుతున్నాం. పర్యావరణానికి హాని కలిగించని ప్యాడ్స్ తయారు చేయించి పేద మహిళలకు, ఆడపిల్లలకు అందిస్తున్నాం. మురికివాడల మహిళలకు వాళ్ల సామర్థ్యాలను గుర్తుచేస్తున్నాం. ఇందుకోసం ‘పెహెచాన్’ అనే కార్యక్రమం చేపట్టాం. అంతేకాదు ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల హాస్టళ్లలో ‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’పై అవగాహన కల్గిస్తున్నాం.
గర్వపడేందుకు నాన్న లేరు..
నేను డిగ్రీలో ఉండగా నాన్న గుండెపోటుతో చనిపోయారు. ఆ విషయం చెప్పకుండా నాన్నకు ఆరోగ్యం బాగాలేదని, నన్ను చూడాలంటున్నారనీ చెప్పారు. కానీ, నేను ఇంటికి వెళ్లేసరికి నిర్జీవంగా ఉన్నారు. నాన్నను అలా చూసి తట్టుకోలేకపోయా. నాన్న భౌతికంగా దూరమై ఐదేండ్లు అవుతున్నా, ఇప్పటికీ ఆయన లేరంటే నమ్మలేను. నన్ను చూసి నాన్న గర్వపడాలన్న నా ఆశ తీరకుండానే వెళ్లిపోయారు. వేదికలమీద పురస్కారాలు అందుకున్న ప్రతిసారీ, ప్రేక్షకులలో నాన్న లేరనే లోటు కుంగదీస్తుంది.
-నిఖిత నెల్లుట్ల