లాక్డౌన్లో బాలీవుడ్ నటి నీనాగుప్తా తన ఆత్మకథను పూర్తి చేశారు. పుస్తకంగా విడుదల చేశారు. ఆమె కథను చదివితే కన్నీళ్లు ఉబికి వస్తాయి. బాలీవుడ్ హీరోయిన్గా ప్రస్థానం మొదలుపెట్టి, పెండ్లికి ముందే తల్లి అయి, సింగిల్ పేరెంట్గా తన బిడ్డను పెంచి, ప్రయోజకురాలిని చేసిన ఆమె ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.
‘నిజం చెప్పాలంటే..’ అంటూ తన ఆత్మకథను మెదలుపెట్టిన అలనాటి అందాలతార నీనాగుప్తా తన జీవితంలోని ఎత్తు పల్లాలను, భావోద్వేగాలను, నిద్రలేని రాత్రులను నిర్భయంగా పాఠకుల ముందుంచారు. తెరమీద అందంగా వెలిగిన ఈ తార, నిజ జీవితంలో అంధకారాన్ని చవిచూశారు. మూడు దశాబ్దాల క్రితమే సింగిల్ మదర్గా మారారు. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ రిచర్డ్స్తో సహజీవనం మధ్యలోనే విచ్ఛిన్నమైంది. గర్భవతిగా ఉన్నప్పుడే అతడి నుంచి విడిపోయారు. ఆ తర్వాత మసాబాకు జన్మనిచ్చారు. మసాబా బాలీవుడ్ హీరోయిన్గా, ఫ్యాషన్ డిజైనర్ పేరు తెచ్చుకున్నారు. మసాబా డెలివరీ సమయంలో నీనా దగ్గర 2,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆ కష్టాలనుంచి గట్టెక్కేందుకు నార్మల్ డెలివరీ అవ్వాలని దేవుడిని కోరుకున్నారట. ఫిల్మ్ స్కూల్ స్నేహితుడు సతీశ్ కౌశిక్, నీనా గర్భవతిగా ఉన్నప్పుడే ఆమెను పెండ్లి చేసుకుంటానని ప్రతిపాదించాడట. అంత పెద్ద విషయాన్ని కూడా చాలా సున్నితంగా తిరస్కరించినట్లు తన ఆత్మకథలో వివరించారామె. ఆ తర్వాత ఢిల్లీకి చెందిన అకౌంటెంట్ వివేక్ మెహ్రాను ఆమె వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం అమితాబ్, రష్మిక ప్రధానపాత్రల్లో నటిస్తున్న ‘గుడ్ బై’ అనే సినిమాలో నటిస్తున్నారు నీనా. ఆమె తాజాచిత్రం ‘సర్దార్ కా గ్రాండ్సన్’ ఇటీవలే నెట్ఫ్లిక్స్లో రిలీజైంది. మంచి ప్రేక్షకాదరణ పొందింది.