ఒక ఆలోచన.. ఆ యువకుడి జీవితాన్నే మార్చేసింది. కరోనా దెబ్బకు ఉపాధి కరువైన వేళ.. ఆదాయ మార్గాన్ని చూపింది. లాక్డౌన్తో ఇంటికే పరిమితమైన ఆ ఆటోడ్రైవర్ను నాటుకోళ్ల వ్యాపారంలోకి దింపింది. కేవలం రూ. 45 వేల పెట్టుబడితో రూ.లక్షల ఆదాయం పొందేలా చేసింది.
కుమ్రం భీమ్ అసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గుండాయిపేట గ్రామానికి చెందిన నాగపూరే వికాస్ ఆటో డ్రైవర్. మూడు చక్రాల బండి నడుపుతూ బతుకు బండి లాగించేవాడు. కరోనాతో ఉపాధిని కోల్పోయి ఇంటికే పరిమితమయ్యాడు. ఆ సమయంలో ‘చికెన్’ తింటే కరోనా దరిచేరదన్న ప్రచారంతో, నాటుకోళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో ‘నాటుకోళ్ల’ వ్యాపారంలోకి దిగాలని నిర్ణయించుకొన్నాడు. తన ఆటోను అమ్మేసి, రూ.45 వేలతో వెయ్యి నాటు కోడి పిల్లలను కొన్నాడు. తన వ్యవసాయ భూమిలోనే ఫెన్సింగ్ వేసి కోళ్ల పెంపకాన్ని ప్రారంభించాడు. ఎప్పటికప్పుడు వాటికి పోషకాహారం అందిస్తూ వచ్చాడు. దీంతో ఆరు నెలల్లోనే ఒక్కో కోడి కిలోకిపైగా బరువు పెరిగింది. మార్కెటింగ్ కోసం ఎక్కడికీ వెళ్లకుండా, తన ఫారం వద్దే అమ్మకాలను ప్రారంభించాడు వికాస్. కిలో కోడి ధర రూ.350. మొదట్లో మందకొడిగా ఉన్నా, రానురానూ గిరాకీ పెరిగింది. వికాస్ పెంచుతున్న నాటుకోళ్లు రుచిగా ఉంటున్నాయనే ప్రచారం రావడంతో చుట్టు పక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి కొనుగోలు చేస్తున్నారు. అలా, నెలలోనే రూ.లక్షకు పైగా రాబడి పొందాడు. ఐడియాలో దమ్ముంటే చాలు.. ఐఎస్బీలో చదవాల్సిన పన్లేదు. ఆంత్రప్రెన్యూర్షిప్ ఏ ఒక్కరి అబ్బసొత్తూ కాదు.
… మజ్జిగపు శ్రీనివాస్రెడ్డి