‘ప్రకృతిని మనం కాపాడితేనే.. ప్రకృతీ మనల్ని కాపాడుతుంది’ ..అంటూ విద్యార్థులకు పర్యావరణ పాఠాలు చెప్పడమే కాదు.. తానూ స్వయంగా ఆ సూత్రాన్ని ఆచరిస్తూ, ఆదర్శంగా నిలుస్తున్నాడో ఉపాధ్యాయుడు. ప్రకృతిపై ప్రేమతో తన ఇంటినే సుందరవనంలా తీర్చిదిద్దారు.
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల కేంద్రానికి చెందిన కనకం నగేశ్, 2019లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం ఆత్మకూర్(ఎస్) మండలం ఏపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. నగేశ్కు మొక్కలంటే అమితమైన ప్రేమ. దేశం నలుమూలల నుంచీ అరుదైన మొక్కలను సేకరిస్తుంటారు. ఇతర దేశాల నుంచీ ఆన్లైన్లో కొనుగోలు చేస్తుంటారు. వీటిని తన ఇంటి ఆవరణలోనే సంరక్షిస్తున్నారు. టెర్రస్పైన మొక్కల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసి, పూర్తి స్థలాన్ని వినియోగంలోకి తీసుకొచ్చారు. పండ్ల మొక్కల పెంపకం కోసం ఆర్గానిక్ పద్ధతిని ఎంచుకొన్నారు. మొక్కలను ఆశించే పురుగులను నిర్మూలించేందుకు పిచ్చుకలను పెంచుతున్నారు. వీటికోసం ఇంటి వసారాలోనే ప్రత్యేకంగా గూళ్లు ఏర్పాటు చేశారు. ‘విలువల పాఠాలు చెప్పే నేను, మరో పదిమందికి ఆదర్శంగా ఉండాలన్నదే నా ఉద్దేశం. మొక్కలకోసం అంతర్జాతీయ నర్సరీ మేళాలకు హాజరవుతా. మా ఇంట్లో ఏడాది పొడవునా ఏదో ఒకరకం పండు అందుబాటులో ఉంటుంది. ఇంటికి వచ్చిన అతిథులు, బంధువులు, స్నేహితులకు కొత్త రకం మొక్కను బహుమతిగా ఇస్తుంటా’ అని చెబుతున్నారు నగేశ్.
… పల్లేటి నాగార్జున