ముంబై : సమోసాలు, పానీపూరి, చాట్ మొదలుకుని అల్పాహారం వరకూ వంటకం ఏదైనా స్ట్రీట్ ఫుడ్ ఇప్పుడు క్రేజీగా మారింది. బయట లభించే ఆహార పదార్ధాల రుచితో పాటు వాటిని ఎలా సర్వ్ చేస్తున్నారనేదీ ఆసక్తి రేపుతోంది. ముంబైలోని ఓ స్ట్రీట్ ఫుడ్ స్టాల్లో వినూత్నంగా వడపావ్స్ను అమ్ముతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నగరంలోని ఫోర్ట్ ప్రాంతంలోని బోర బజార్ స్ట్రీట్లో రఘు దోసె వాలా ఆరున్నర దశాబ్ధాల నుంచి దోసె, ఇడ్లీ వడ, చీజ్ మసాలా వడపావ్లను కస్టమర్లకు అందిస్తూ ఆకట్టుకుంటోంది. ఈ స్టాల్ ఓనర్ వడలను గాలిలోకి విసిరి తిరిగి అవి పెనంపైకి వచ్చేలా వినూత్న స్టైల్తో వడపావ్స్ను కస్టమర్లకు చేరువచేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
వడపావ్లో ఉల్లి, క్యాబేజ్, బీట్రూట్, క్యాప్సికమ్, టొమాటో వంటి కూరగాయలను స్టఫ్ చేసి వెన్న, మసాలాలను మిక్స్ చేసి కస్టమర్లకు అందిస్తారు. ఈ రుచికరమైన వడపావ్స్ కేవలం రూ 15కే అందుబాటులో ఉంచారు. ఆంచి ముంబై యూట్యూబ్లో షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకూ 3.54 లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తలో రకంగా కామెంట్ చేశారు. ఈ వీడియోను చూసిన తర్వాత ఫ్లైయింగ్ పానీపూరి ప్లీజ్ అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించగా, మరో నెటిజన్ ఫ్లైయింగ్ వడపావ్ కావాలని తాను అడగ్గా మా అమ్మ ఫ్లైయింగ్ చెప్పల్తో బదులిచ్చారని మరో నెటిజన్ జోక్ చేశాడు. కాగా అంతకుముందు ముంబైలోని ప్రభాదేవిలో బాలాజీ దోశ నిర్వాహకుల ఫ్లైయింగ్ దోశల వీడియో కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే.