ఎప్పటి పౌరాణిక చిత్రాలు, జానపద సినిమాలు! వాటిలో యుద్ధ సన్నివేశాలు చూస్తున్నంతసేపూ ప్రేక్షకులు లీనమైపోయేవారు!! వెండితెర కొత్త రంగులు పులుముకునే కొద్దీ అలాంటి చిత్రాలు కరువయ్యాయి. యుద్ధ సన్నివేశాలకూ తెరపడింది. మళ్లీ ఇన్నాళ్లకు తెలుగు సినిమాలు.. ఆ మాటకొస్తే హిందీ సినిమాలు కూడా యుద్ధంపై కన్నేశాయి. జానపద, పౌరాణిక, చారిత్రక నేపథ్యం ఉన్న కథలను ఎంచుకొని యుద్ధ విన్యాసాలను వినూత్నంగా తెరకెక్కిస్తున్నాయి.
గతంలో రాజ్యాల మధ్య యుద్ధాలకు కథాంశంలో స్థానం ఇచ్చినా, ఆ సన్నివేశాలకు ైక్లెమాక్స్లో కానీ చోటు దక్కేది కాదు. పౌరాణిక చిత్రాల్లోనూ పతాక స్థాయికి చేరాకే.. యుద్ధం అనివార్యమయ్యేది! కానీ, సినిమా విజయం కోసం కొత్తకొత్త సూత్రాలను అన్వేషిస్తున్న దర్శకులు ప్రధాన కథతో యుద్ధ సన్నివేశాలకూ సమ ప్రాధాన్యం ఇవ్వడం మొదలైంది. అందుకు చక్కటి ఉదాహరణ ‘బాహుబలి’ రణక్షేత్రమే. ‘మగధీర’తో వీరోచిత విన్యాసాలకు ట్రైలర్ చూపిన దర్శకమౌళి రాజమౌళి.. బాహుబలి ఉభయ భాగాలనూ అసమాన సమరాంగణాలుగా తీర్చిదిద్దాడు. ఈ సినిమాల్లో కథ, కథనానికి దీటుగా తీసిన యుద్ధం ఎపిసోడ్లు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాయి. పాత్రల ఔన్నత్యాలను, బలాబలాలను సైతం రణక్షేత్రంలో ఆవిష్కరించడంలో ఘన విజయం సాధించి రికార్డు కలెక్షన్లు సొంతం చేసుకున్నాడు. బాలకృష్ణ కథా నాయకుడిగా రూపొందిన చారిత్రక చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లోనూ యుద్ధ విన్యాసాలు మెప్పించాయి. ‘సైరా నరసింహారెడ్డి’లో యుద్ధ సన్నివేశాలు ప్రేక్షకులతో ‘ఔరా!’ అనిపించాయి. ఆ తర్వాత తెలుగు తెరపై మరో యుద్ధానికి తెర తీస్తున్నాడు రాజమౌళి. ఊహాజనిత చారిత్రక చిత్రంగా తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’లో ఇద్దరు యోధుల మధ్య యుద్ధాన్ని చూసి రోమాలు నిక్కబొడుస్తాయని ఘంటాపథంగా చెబుతున్నది చిత్ర యూనిట్.
‘పోరు’బాటలో బాలీవుడ్
తెలుగు సినిమా రాజ్యాల మధ్య యుద్ధాలకు పెద్దపీట వేస్తే.. బాలీవుడ్ దేశాల మధ్య వార్కు ప్రాధాన్యం ఇస్తున్నది. భారత్-పాకిస్థాన్, భారత్-చైనా యుద్ధాలను కథా వస్తువులుగా మేటి సినిమాలను నిర్మిస్తున్నది. దశాబ్దాల కిందట పొరుగు దేశాలతో జరిగిన పోరును ఇతి వృత్తంగా తీసుకొని ఆసక్తికరమైన కథలు అల్లుకుంటున్నారు బాలీవుడ్ సృజనులు. సంగ్రామ సర్వస్వం కథాంశంగా అప్పట్లో అడపాదడపా సినిమాలు వచ్చేవి. బార్డర్, ఎల్ఓసీ: కార్గిల్, లక్ష్య తదితర సినిమాలు యుద్ధం నేపథ్యంలో తెరకెక్కినవే! ఇప్పుడు, అదే ట్రెండ్గా మారింది. తాజాగా బాలీవుడ్లో తెరకెక్కిన సినిమాలే ఇందుకు ఉదాహరణ. వరుసగా వచ్చిన, వస్తున్న సినిమాలు బాలీవుడ్ సినిమాను రణరంగస్థలంగా మార్చాయని చెప్పకనే, చూపుతున్నాయి. సర్జికల్ స్ట్రైక్ కథాంశంతో తెరకెక్కిన ‘ఉరి’ సినిమా మెరుపు విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత బాలీవుడ్లో పోరాట చిత్రాలు దాదాపుగా క్యూ కట్టాయి.
వరుస యుద్ధ చిత్రాలు
కథ ఏదైనా యుద్ధం ప్రధానంగా తెరకెక్కిస్తున్నారు బాలీవుడ్ దర్శకులు. 1971 ఇండియా-పాకిస్థాన్ యుద్ధం, 1999 కార్గిల్ యుద్ధాలను ప్రధానంగా చేసుకొని ఇటీవల ఓటీటీ వేదికగా విడుదలైన పలు చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అందుకు కారణం యుద్ధ నేపథ్యమే! సిద్ధార్థ మల్హోత్రా, కియారా అద్వాణి నాయకానాయికలుగా తెరకెక్కిన ‘షేర్షా’ నేపథ్యం కార్గిల్ యుద్ధమే. 1999లో జరిగిన ఆ సమరంలో తన పరాక్రమంతో భారత్ విజయానికి బాటలు వేసిన విక్రమ్ బాత్రా జీవిత కథ ఆధారంగా నిర్మించిన ఈ సినిమా ఓటీటీలో మెగా సక్సెస్ సాధించింది. 1971 భారత్-పాక్ యుద్ధం నేపథ్యంలో ఓటీటీకెక్కిన మరో చిత్రం ‘భుజ్’. సినిమా కథనంలో కొన్ని లోపాలున్నాయని విమర్శలు వచ్చినా.. మంచి టాక్ సొంతం చేసుకుంది. వీటికన్నా ముందు శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ నటించిన ‘గుంజన్ సక్సేనా- ద కార్గిల్ గాళ్’ సినిమా కూడా ప్రేక్షకులను అలరించింది. యుద్ధ కథలతో సిద్ధమవుతున్న కథలెన్నో రానున్న రోజుల్లో వెండితెరపై కనువిందు చేయనున్నాయి. యుద్ధ నేపథ్యం ఉన్న చారిత్రక సినిమాలు సైతం విజయబావుటా ఎగురవేస్తున్నాయి. అక్షయ్కుమార్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘కేసరి’ చరిత్రలో సిక్కు వీరుల పోరాట పటిమను చాటి చెప్పింది. కంగనా రనౌత్ నటించిన ‘మణికర్ణిక’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిన ‘పద్మావత్’, ‘తానాజీ’,
‘పానిపట్’ తదితర చిత్రాలు సైతం హిట్ టాక్ను సొంతం చేసుకున్నాయి. ఓ సినిమా తీయడం అంటేనే ఓ యుద్ధంతో సమానం. ఇక యుద్ధం మీద సినిమా అంటే.. శత సంగ్రామాలతో సమానం. ప్రేక్షకుడి ఆమోద ముద్ర పడితేనే.. ఆ పోరాటానికి ఓ అర్థం, బాక్సాఫీసులో ఆర్థిక విజయమూ!
వార్ ట్రెండ్కు అనుగుణంగా ఓటీటీలోనూ యుద్ధప్రాతిపదికన యుద్ధ నేపథ్యం ఉన్న వెబ్సిరీస్లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఆజాద్ హింద్ ఫౌజ్కు చెందిన సైనికుల త్యాగాలను గుర్తు చేస్తూ విడుదలైన ‘ద అన్ఫర్గాటెన్ ఆర్మీ’ వెబ్సిరీస్ మంచి టాక్ను సొంతం చేసుకుంది. టెర్రరిస్ట్ల విధ్వంస ప్రయత్నాలను భగ్నం చేసే కథలూ ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ‘ద ఫ్యామిలీ మ్యాన్’ రెండు భాగాలూ ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపే కథాంశంతోనే తెరకెక్కాయి. 26/11 ముంబయి ఉగ్రదాడుల చుట్టూ నిర్మించిన ‘స్టేట్ ఆఫ్ సీజ్’, ‘ముంబయి డైరీస్’ వెబ్సిరీస్లు ఉత్కంఠ భరితంగా సాగుతూ ప్రేక్షకులను కట్టిపడేశాయి. అన్ని వర్గాల వీక్షకుల ఆదరణ లభిస్తుండటంతో వార్ జానర్లో మరిన్ని ఆసక్తికరమైన వెబ్సిరీస్లు, సినిమాలు నిర్మించేందుకు దర్శక నిర్మాతలు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు.