తలెత్తుకుని, రొమ్మువిరిచి నిలబడే సందర్భం పంద్రాగస్టు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ.. రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకానికి చెయ్యెత్తి జైకొడుతున్నప్పుడు నరనరాల్లో గర్వం ప్రవహిస్తుంది. ఆ మువ్వన్నెలు మురిపెంగా మెరవడం వెనుక ఎందరో సమరయోధుల త్యాగాలు ఉన్నాయి. శతాబ్దాలు పోరాడి సాధించిన స్వేచ్ఛను కాపాడేందుకు సరిహద్దుల్లో కాపుకాస్తున్న వీర జవాన్ల పోరాటాలున్నాయి. ఆ యోధుల గాథలే కథలుగా నిర్మించిన చిత్రాలు ఎప్పుడొచ్చినా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి. ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా యుద్ధ కథలు ఓటీటీ తెరపై, సెల్యూలాయిడ్ స్క్రీన్పై మెరుస్తున్నాయి. ఇంకొన్ని విడుదలకు సిద్ధం అవుతున్నాయి.
మార్షల్ మ్యాజిక్: సైమ్ బహదూర్
1971 ఇండో-పాక్ వార్పై గతంలో ఎన్నో చిత్రాలు వచ్చాయి. ఆ కోవకే చెందుతుంది.. సైమ్ బహదూర్. శత్రుదేశాన్ని రెండుగా చీల్చడంలోనే కాదు, దాయాది సైనికులను దౌడు పెట్టించిన వీర కేసరి ఫీల్డ్ మార్షల్ బహదూర్ మానెక్షా. ఆయన నేతృత్వంలో జరిగిన యుద్ధంలో భారత సైనిక పటాలం పటిమ యావత్ ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఈ యోధుడి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమే ‘సైమ్ బహదూర్’. సర్జికల్ ్రైస్టెక్ నేపథ్యంలో వచ్చిన ‘ఉరి’ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన విక్కీ కౌశల్.. మానెక్ షాగా నటిస్తుండటం విశేషం. బహదూర్ వ్యక్తిగత జీవిత విశేషాలతోపాటు 1971 యుద్ధంలో ఆయన పాటించిన యుద్ధ తంత్రాన్ని ఇందులో ప్రముఖంగా చూపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర మోషన్ పోస్టర్స్ ఆసక్తిని పెంచుతున్నాయి. కొన్ని రోజుల్లోనే ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది.
ప్రైడ్ ఆఫ్ ఇండియా: భుజ్
1971 ఇండో-పాక్ యుద్ధం నాటి వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా భుజ్- ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఈ నెల 14న డిస్నీ హాట్స్టార్లో విడుదలైన ఈ చిత్రం స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా హిట్ టాక్ను సొంతం చేసుకుంది. యుద్ధ సమయంలో పాక్ దళాలు గుజరాత్లోని భుజ్ వైమానిక స్థావరంపై కన్నేస్తాయి. దాడులు జరిపి రన్వేను పూర్తిగా ధ్వంసం చేస్తాయి. ఈ క్రమంలో భుజ్ వైమానిక దళం కమాండర్గా ఉన్న విజయ్ శ్రీనివాస్ కర్ణిక్ ఏం చేశాడన్నది చిత్రకథ. పరిసర గ్రామాలకు చెందిన మహిళల సహకారంతో రాత్రికి రాత్రి రన్వేను నిర్మించడం, ఈ క్రమంలో జరిగే దాడులను ఎదుర్కోవడం.. రోమాంచితంగా చిత్రీకరించారు. శ్రీనివాస్ కర్ణిక్గా అజయ్ దేవగణ్ అద్భుతంగా నటించాడు. సంజయ్దత్, సోనాక్షి సిన్హా తదితరుల కౌశలం సినిమాకు ప్లస్ అయింది.
విహంగ సివంగి: తేజస్
మణికర్ణిక చిత్రంతో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది నటి కంగనా రనౌత్. ఇప్పుడు అదేజోరులో ‘తేజస్’లో నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తేజస్ యుద్ధ విమానాన్ని నడిపే మహిళా పైలట్గా కనిపించనుంది కంగనా. పురుషులకు దీటుగా మహిళా పైలెట్ల సాహసాలే ఇతివృత్తంగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సర్వేశ్.
ఏ దిల్ మాంగే మోర్: షేర్షా
కార్గిల్ యుద్ధంలో అమరుడైన కెప్టెన్ విక్రమ్ బాత్రా బయోపిక్.. షేర్షా. అమెజాన్ ప్రైమ్లో విడుదలైన ఈ చిత్రం వీరజవాన్ల త్యాగనిరతికి ఉదాహరణగా నిలుస్తుంది. ‘ఏ దిల్ మాంగే మోర్’ అంటూ విక్రమ్ చేసిన యుద్ధ విన్యాసాలు ఈ చిత్రంలో హైలెట్. కార్గిల్ వార్లో భారత్ పైచేయి సాధించడానికి కారణమైన పాయింట్ 4875 శిఖరాన్ని బాత్రా నేతృత్వంలోని సైనిక బృందం స్వాధీనం చేసుకుంటుంది. ఈ క్రమంలో విక్రమ్ బాత్రా వీర మరణం పొందుతాడు. అచంచలమైన ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఆయనకు మరణానంతరం పరమవీర చక్ర అవార్డు లభించింది. ఈ యోధుడి కథను కండ్లకు కట్టినట్టు తీర్చిదిద్దాడు దర్శకుడు విష్ణువర్ధన్. విక్రమ్ బాత్రాగా సిద్ధార్థ్ మల్హోత్రా జీవించాడు. ఆయన ప్రేయసి డింపుల్గా కియారా అద్వానీ మెప్పించింది. ఈ సినిమా థియేటర్లలో రిలీజై ఉంటే బాక్సాఫీస్ రికార్డులు గల్లంతయ్యేవని ఇండస్ట్రీ టాక్.