‘బిడ్డా! పుట్టిన గడ్డకోసం, దేశంకోసం మనం ఎంతోకొంత చెయ్యాలె, మర్చిపోవద్ద్డు’ అంటూ ఓ సందర్భంలో స్వాతంత్య్ర సమరయోధుడైన తాత చెప్పిన మాటలు ఆమెను అపారంగా ప్రభావితం చేశాయి. అందుకే, కేంద్ర ప్రభుత్వ కీలక శాఖల్లో పనిచేసే అవకాశం వచ్చినా, పురిటిగడ్డ వైపే మొగ్గు చూపారు. తెలంగాణ సర్కారులోని పరిశ్రమలు-వాణిజ్య శాఖలో వివిధ విభాగాలను సమర్థంగా సమన్వయం చేస్తూ మంచి పేరు తెచ్చుకొంటున్నారు నోడల్ ఆఫీసర్ మందడి శ్రీహారెడ్డి దేశ్ముఖ్.
‘మేడమ్! ఎన్నో నెలలు పడుతుందనుకున్న ప్రాజెక్ట్ ఇంత త్వరగా కార్యరూపం దాల్చుతుందని కలలో కూడా అనుకోలేదు. ఎక్కడా ఏ కష్టం లేకుండా చూశారు. థ్యాంక్స్’
యూనివర్సల్ టాయ్స్ ప్రతినిధుల మాట.
‘శ్రీహా! నీ దగ్గరకు ఏదైనా ప్రాజెక్ట్ వచ్చిందంటే కచ్చితంగా సక్సెస్ అవుతుంది’..
సీఐఐ, ఐసీసీ, నాస్కామ్ బృందాల ప్రశంస.
తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు-వాణిజ్య శాఖలో టాయ్స్ ఇండస్ట్రీ నోడల్ ఆఫీసర్గా, ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ విభాగ సమన్వయకర్తగా, ‘వన్ డిస్ట్రిక్ట్ – వన్ ప్రొడక్ట్’ (ఓడీఓపీ) బాధ్యురాలిగా, జియోగ్రాఫికల్ ఇండికేషన్ ప్రొడక్ట్స్(జీఐ) ప్రత్యేక అధికారిగా.. కీలక విభాగాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు శ్రీహారెడ్డి. ఏడాదికాలంగా కరోనా మహమ్మారి వల్ల పలు దేశాల నుంచి బొమ్మల దిగుమతి ఆగి పోయింది. దీంతో ‘మేకిన్ ఇండియా’లో భాగంగా దేశీయ బొమ్మల తయారీపై ఆయా రాష్ర్టాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో భారీగా బొమ్మల తయారీకి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. వందల ఎకరాల్లో ‘తెలంగాణ టాయ్ పార్కు’ను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. దీనికంటూ ఓ ప్రత్యేక విభాగాన్ని సృష్టించి మందడి శ్రీహారెడ్డి దేశ్ముఖ్ను నోడల్ అధికారిగా నియమించింది రాష్ట్ర పరిశ్రమలు-వాణిజ్య శాఖ. తరాల నుంచీ తెలంగాణ బొమ్మల తయారీకి చిరునామా. నిర్మల్ కొయ్య బొమ్మలు, బొంతపల్లి లక్క బొమ్మలు చాలా ప్రసిద్ధి. వీటితో పాటుగా ఎలక్ట్రిక్, సాఫ్ట్, ఎడ్యుకేషనల్ టాయ్స్ను కూడా ఉత్పత్తి చేసేందుకు అవసరమైన ఓ సమగ్ర ప్రణాళికను ప్రభుత్వానికి సమర్పించారు శ్రీహారెడ్డి. కొయ్య బొమ్మలకు, లక్క బొమ్మలకు కొత్తరూపం ఇస్తూ, డిజిటల్ యుగంలో పుట్టిన పిల్లలను ఆకర్షించేందుకు టీ-హబ్ నుంచి సృజనాత్మక సహకారం తీసుకుంటున్నారామె. ప్రస్తుతం బొమ్మల తయారీ ద్వారా 73 శాతం మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. త్వరలో ఏర్పాటు చేయబోయే పార్కులో సైతం మహిళలకే ప్రాధాన్యం ఇవ్వాలన్నది సర్కారు లక్ష్యం, శ్రీహారెడ్డి సంకల్పం కూడా.
తనదైన ముద్ర
‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సమన్వయకర్తగా విదేశీ ప్రతినిధులతో మాట్లాడటం, ఇక్కడి వసతుల గురించి వివరించి, పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సహించడం శ్రీహారెడ్డి ప్రధాన బాధ్యతలు. తెలంగాణ అన్నపూర్ణ. ప్రతి జిల్లా ఏదో ఓ పంటకు చిరునామా. తెలంగాణ డీఎన్ఏలోనే సృజన ఉంది. ప్రతి జిల్లా ఏదో ఓ ఉత్పత్తికి ప్రసిద్ధి. ఆ వైవిధ్యాన్ని ఓ బ్రాండ్లా విశ్వ విపణిలోకి తీసుకెళ్లాలన్నదే సర్కారు సంకల్పం. ‘వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్’ (ఓడీఓపీ) ప్రత్యేక అధికారిగా వివిధ జిల్లాలు పర్యటిస్తూ.. రైతులను, తయారీదారులను ప్రోత్సహిస్తున్నారామె. జియోగ్రాఫికల్ ఇండికేషన్ ప్రొడక్ట్స్(జీఐ) బాధ్యురాలిగా తెలంగాణలోని ప్రసిద్ధ వంటల నుంచి పంటల వరకూ, చారిత్రక ప్రదేశాల నుంచి సంప్రదాయ పనిముట్లు, హస్తకళల వరకూ అరుదైన వారసత్వాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు.
కేటీఆర్ ‘ముందుమాట’
శ్రీహారెడ్డి రాసిన ‘మేక్-ఇన్- తెలంగాణ’ పుస్తకం పారిశ్రామిక రంగంలో మన బలాన్ని చాటుతుంది, ఉజ్వల భవిష్యత్తును ఊహిస్తుంది. దీనికి మంత్రి కేటీఆర్ ముందుమాట రాశారు, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్తో కలసి ఆవిష్కరించారు. తెలంగాణలోని పర్యాటక ప్రదేశాలు, రుచులు, డిజైన్లు, కళలు, పండగలు.. తదితర కోణాలను సమగ్రంగా స్పృశిస్తూ ఓ కాఫీ టేబుల్ బుక్నూ రూపొందించారు శ్రీహారెడ్డి. గత ఏడాది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ‘యంగ్ అచీవర్ అవార్డు’ను స్వీకరించారు శ్రీహా. తాను ఎంబీఏలో గోల్డ్మెడల్ సాధించిన విశ్వవిద్యాలయం నుంచే ఈ గౌరవాన్ని అందుకోవడం విశేషం. పర్యావరణ పరిశోధనలకు గాను ‘యంగ్ సైంటిస్ట్’ అవార్డును కూడా స్వీకరించారు
శ్రీహారెడ్డి.
‘తెలంగాణ ప్రభుత్వం మాలాంటి యువ అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. యాప్ ఆధారంగా పనిచేసే బొమ్మలతో విద్యాబోధన చేయాలన్న వినూత్న ఆలోచనతో ఓ ప్రాజెక్టు రూపొందించాం. ఆ ఆటలలోనే చదువునూ భాగం చేస్తాం. నైపుణ్య అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలను సృష్టించవచ్చు. ప్రభుత్వ దిశా నిర్దేశంలో ఉద్యోగ, ఉపాధి కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నాం.
మందడి శ్రీహారెడ్డి
టాయ్స్ సెక్టార్ నోడల్ ఆఫీసర్
… డప్పు రవి