Dyavari Narender Reddy | ఆయన జీవితంలో ఆంగ్లానిదే ఆధిపత్యం. అయితేనేం, తెలుగును చిన్నబుచ్చలేదు. కవితలు రాశాడు. శతకాలు అల్లాడు. ‘విరాటపర్వం’ సినిమాకు ‘నిప్పు ఉంది.. నీరు ఉంది.. నగాదారిలో’ గీతాన్ని అందించి అజ్ఞాతవాసాన్ని వీడి విజయపర్వాన్ని ప్రారంభించాడు ద్యావరి నరేందర్ రెడ్డి. వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన ఆ ఉపాధ్యాయ కవి పరిచయం..
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రం నరేందర్రెడ్డి సొంతూరు. తండ్రి చిన్న రాంరెడ్డి. తల్లి నారాయణమ్మ. రైతు కుటుంబమే అయినా కొడుకును ఆంగ్ల మాధ్యమంలో చదివించారు. నరేందర్రెడ్డి విద్యాభ్యాసమంతా తాండూరులోనే. 2002లో సెకండరీ గ్రేడ్ టీచర్గా ఉపాధ్యాయ వృత్తి చేపట్టాడు. 2006లో ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొందాడు. ప్రస్తుతం పెద్దేముల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నాడు.
చదివింది ఆంగ్ల మాధ్యమం. బోధిస్తున్నది ఆంగ్లం. అయినా నరేందర్కు తెలుగు భాషంటే ప్రత్యేక అభిమానం. సమయం దొరికితే చాలు తెలుగు పుస్తకాలు చదువుతాడు. ఇంటినే గ్రంథాలయంగా మార్చేశాడు. విద్యార్థి దశలోనే కవితలు రాసేవాడు. భాషపై పట్టు దొరికిన తర్వాత పద్యరచన మొదలుపెట్టాడు. లక్ష్మీ నరసింహ శతకం, వేంకటేశ్వర శతకం, అయ్యప్పస్వామి శతకం, అమృతవర్షిణి శతకం.. ఇలా పలు రచనలు చేశాడు. గీతామృతం, హంసధ్వని మినీ కవితలు, వేంకటేశ్వర భక్తి గజల్స్ రాశాడు. ‘విరాటపర్వం’ సినిమా ద్వారా పాటల రచయితగా పరిచయం అయ్యాడు నరేందర్రెడ్డి. ఈ సినిమా కోసం రెండు పాటలు, ఒక గజల్, రెండు పద్యాలు రాశాడు. ‘నగాదారిలో..’ పాటతో ఇండస్ట్రీ అంతా నరేందర్ ఎవరంటూ వాకబు చేస్తున్నది. ‘ఆధిపత్య జాడలనే చెరిపేయగ ఎన్నినాళ్లు.. తారతమ్య గోడలనే పెకిలించగ ఎన్నినాళ్లు..’ అంటూసాగే గజల్తోనే ‘విరాటపర్వం’ టీజర్ మొదలైంది. ‘తల్లి మనసే వేచెనే తన బిడ్డ రాకకై..’ అంటూ హృద్యంగా సాగే పాట కూడా ప్రేక్షకులను కదిలించింది. ‘విరాటపర్వం’ విజయంతో, మరో సినిమాలోనూ అవకాశం దక్కించుకున్నాడు నరేందర్. ‘గురువులు పురుషోత్తమాచార్య, విశ్వనాథం ప్రేరణతో చదువుకునే రోజుల్లోనే పద్య రచన ప్రారంభించాను’ అని చెబుతారాయన.
… పెరుమాళ్ల వెంకట్రెడ్డి