మహిళలు రాణించని రంగం లేదిప్పుడు. కొత్త ఆవిష్కరణల నుంచి పాతను పరిరక్షించుకునే వరకూ.. ఏ సవాలునైనా స్వీకరిస్తున్నారు. తాజాగా, ప్యారిస్లోని 228 ఏండ్ల ‘లవ్రే’ మ్యూజియానికి డైరెక్టర్గా నియమితులయ్యారు లారెన్స్ డెస్ కార్స్. ఆ మ్యూజియం సంగతులు, ఈ మహిళా డైరెక్టర్ విశేషాలు..
రెండు శతాబ్దాల చరిత్రగల ‘లవ్రే’ మ్యూజియానికి లారెన్స్ డెస్ కార్స్ మొదటి మహిళా ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె ప్యారిస్లోనే ఉన్న మ్యూసీ డి ఓర్సే అనే మ్యూజియానికి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. దానికికూడా లారెన్సే మొదటి మహిళా డైరెక్టర్. 19, 20 శతాబ్దాలనాటి ఆర్ట్లో ఆమె స్పెషలిస్ట్. లారెన్స్ ప్యారిస్ సార్బోన్ యూనివర్సిటీలో ఆర్ట్ హిస్టరీ చదివారు. తర్వాత, ఎకోల్ డూ లవ్రే యూనివర్సిటీలో టీచర్గా పని చేశారు. ఆ సమయంలో ఎన్నో మ్యూజియాల్లో ఎగ్జిబిషన్లను నిర్వహించారు. 1994లో మ్యూసీ డి ఓర్సే మ్యూజియానికి క్యూరేటర్ అయ్యారు. 2017లో, పదోన్నతిపొంది డైరెక్టర్ పదవి చేపట్టారు. లారెన్స్ కుటుంబంలో ఎక్కువమంది జర్నలిస్టులు, రచయితలే. ఆమెకూడా అనేక రచనలు చేశారు.
ప్యారిస్లోని లవ్రే.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ట్ మ్యూజియం. ఇందులో దాదాపు నాలుగు లక్షల అరుదైన కళాఖండాలు, 35 వేల శిల్పాలు, పెయింటింగ్స్, డ్రాయింగ్స్ ఉన్నాయి. లాక్డౌన్ ముందువరకు రోజూ15,000 మంది సందర్శించేవారు.. అందులో, 65శాతం మంది విదేశీయులే. ప్రపంచ ప్రఖ్యాత మోనాలిసా చిత్రం ఇక్కడిదే. క్రీ.శ. 1791 మే నెలలో లవ్రే భవంతిని మ్యాజియంగా మార్చారు. దానికి ముందు ఇక్కడ రాజవంశీయులు నివసించేవారు. మ్యూజియంగా మారినప్పటి నుంచీ చారిత్రక కళా కృతులను భద్రపరుస్తున్నారు. 1792లో ఈ మ్యూజియాన్ని ‘జాతీయ వారసత్వ సంపద’గా ప్రకటించారు. ఆ తర్వాత సంవత్సరం నుంచీ ప్రజల సందర్శనకు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఈ మ్యూజియం డైరెక్టర్లుగా ఉన్నవారంతా పురుషులే!