సావులకు, బతుకులకు చెప్పనీకె ఇప్పుడంటె ఫోన్లున్నయి.కానీ, ఎన్కట గీ ఫోన్లెక్కడివి? గీ కతెక్కడిది? ఐనా.. కబురు చేరుతుండె. కార్యం జరుగుతుండె.అప్పటి తిండేంది? వాళ్ల కష్టమేంది? తెల్సుకోనీకె లచ్చిందేవవ్వ ‘యాది’లకు వెళ్దాం!
నా పేరు నర్రాగుల లచ్చిందేవవ్వ. తొంబై రొండు, తొంబై మూడేండ్లు మా ఉంట. మా ఇంటాయ్నె రాయమల్లు, పదేండ్ల కింద జరిగిపోయిండు. మాది సిరిసిల్ల దగ్గర చందుర్తి తాలుకా రామరావుపల్లె. నాకు ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డె. మనుమలు, మనుమరాండ్లకు కూడా పెండ్లీలయ్యి, పిల్లలయిండ్రు. నిమ్మళంగా బతుకుతాండ్రు.
తీర్వాటం లేకుండె
అత్తమామలు, యారాండ్ల పోరు లేకుంట మంచిగ ఉన్న. మా ఇంటాయిన్నే అప్పుడప్పుడు కోపానికస్తుండె. ‘ఏమైందీ మనిషికి. పిసగూడ లేశిందా ఏంది?’ అనిపించి ‘సూడయ్యా.. నిన్నియాల పిలగాళ్లు పెద్దగయిండ్రు. వాళ్ల ముంగట ఈ లొల్లి పెట్టుకుంటే బాగుంటదా?’ అని గట్టిగా అర్సుకున్నా. ఇగ ఆనాటి సంది నన్ను ఓ మాటన్నది లేదు. ఓ దెబ్బ కొట్టింది లేదు. పాపం ఆయ్నె కూడా మస్తు పనిజేస్తుండె. ఒకటో రెండో కావాయె. పది పదిగేను బర్లుంటుండె. ఆవులుంటుండె. మోట గొట్టుడాయె. ఏతమేసుడాయె. తీర్వాటమెక్కడిది?
సైకిలిచ్చి పంపుదుము
ఇప్పటిదంతా మందుల తిండి. మా కాలంల ఇట్ల లేకుండె. నువ్వుల చేన్లు ఏస్తుంటిమి. కాతకు రాంగనే తెంపి గానుగతో నూనె తయారుచేద్దుము. అట్లనే ఆముదం నూనె కూడా. వడ్లు, కారం, పసుపు దంచుకునే తిందుము. జొన్న గడ్క, తైదంబలి, జొన్న రొట్టె, అన్పలు తిని బతికినం. అసొంటి తిండి తిన్నం కావట్టె ఇంత గట్టిగున్నం, కష్టం జేసినం. ఈ కాలం పోరగాళ్లకు పదిహేనేండ్లకే తెల్లెంటికెలొస్తున్నయి. ముప్పయేండ్లకే ముసలోల్లయితాండ్రు. నడ్మంత్రపు చేతలు, నడ్మంత్రపు బతుకులు. ఫోన్లతోటే సగం సంసారం జేస్తాండ్రు. సావులకు, బతుకులకు ఫోన్ కొడితే అయిపోతాంది. మా కాలంల ఈ ఫోన్లెక్కడియి? ఈ కతెక్కడిది? సావైనా, పురుడైనా ఊరి సాకలాయ్నెకు సైకిలిచ్చి పంపుదుము. పాపం.. ఎంత దూరమైనా పోతుండె. ఇప్పుడైతే బండ్లు, కార్లొచ్చినయి. ఐనా ‘ఊరికి వొయ్యి అక్కను తోల్కరాపోర్రా’ అంటే కోపానికొత్తాండ్రు. మీదిమిక్కిలి ‘మాకేడ టైముంది’ అంటాండ్రు.
మస్తు మర్యాద చేద్దుము
మేము ఎటన్నా ఊరికి పోవాల్సొస్తే పిలగాళ్లను భుజాల మీదేసుకొని, చెయ్ సంచులు పట్టుకొని నడ్సుకుంటనే పోద్దుము. పోరగాళ్లు మధ్యల ఆకలైతే ఏడుస్తరని సద్ది కట్టుక పోతుంటిమి. ఇగ ఇప్పుడు పెండ్లీలు కాకముందే ఫోట్వలు పంపిస్తాండ్రు. నేనైతే పెండ్లయినంక కూడా మా రాయమల్లుతో మాట్లాడకపోదు. నన్ను చూసుకోనీకె మావోళ్లు ఎడ్లబండిల వచ్చిండ్రు. మా రాయమల్లు లాగుతోటే వచ్చిండు. కనీసం నా మొకంగూడా సూడలే. వొచ్చి ఇంట్లె చెయ్యి కడిగి, తిని పోయిండ్రు. పదిగేను రోజుల నాడు లగ్గమే అయింది. ఇప్పుడు దేనికైనా ముందుగాల్నే చెప్తాండ్రు. మనం బోయే సరికి వాళ్లు చికన్లు, మటన్లు వండి పెడుతుండ్రు. కానీ మా జమానల ఏ సుట్టము ఎప్పుడొస్తుండెనో తెల్వకపోయేది. సుట్టమొచ్చిండని మా రాయమల్లు గౌండ్లాయ్నెకు కల్లు చెప్తుండె. కోడిని కోశి సుట్టానికి మంచిగ మర్యాద చేస్తుంటిమి.
మనుమలు మంచోళ్లు
మేము పిల్లలను ఏనాడూ కష్టపెట్టలే. ఎవరి తెలివి వాళ్లకొచ్చినంక వాళ్లు కష్టపడ్డరు. జాగలు కొనుక్కొని ఇండ్లు కట్టుకున్నరు. ఇంకా నాలుగు పైసలు సంపాయనీకె మా మనుమలు దుబాయ్ పోయిండ్రు. ‘అవ్వా.. మా కోసం అంత కష్టవడ్డవ్గానే.. గాలిమోటరెక్కిస్తం ఓపారి రాయే’ అని ఎన్నోసార్ల బతిమిలాడిండ్రు. కానీ నాకు ఇష్టం లేకుండె. ‘బండెక్కాలంటెనే భయం. ఇగ ఇమానమేడెక్కుదయ్యా’ అనేదాన్ని. ఇగ నేను రానని వాళ్లవ్వను ఇమానంల తీస్కపోయిండ్రు మా మంచి మనుమలు.
-దాయి శ్రీశైలం