ఆమె లాయర్. వ్యవసాయం అంటే ఇష్టం. కానీ, సాగు చేయడానికి పొలం లేదు. లేకపోతేనేం, మనసుంటే డాబాపైనా సేద్యం చేయవచ్చు. మల్లెల సాగుతో డబ్బుల ముల్లెలు దించుతున్నది కిరణ దేవడిగ.
మంగళూరుకు చెందిన కిరణ దేవడిగ న్యాయవాది. వ్యవసాయం చేయాలని ఆమె కోరిక. కానీ జానెడు భూమి కూడా లేదు. ఇప్పటికిప్పుడు ఎకరమో రెండెకరాలో కొనే పరిస్థితీ లేదు. ఎక్కడైనా కౌలుకు తీసుకుందామని అనుకుంది. ఇంట్లోవాళ్లు ఆసక్తి చూపలేదు. ఆ ఆలోచనా విరమించుకున్నది. డాబా మీద సరదాకు మూడు మల్లె మొక్కలు పెంచుకున్నది. ఆ పరిమళాలను ఆస్వాదిస్తూ సృజనాత్మక వ్యాపారం గురించి ఆలోచించేది. అప్పుడే, ఒక ఐడియా వచ్చింది. ‘మల్లె మొక్కలు పెంచితే ఎలా ఉంటుంది?’ అనుకున్నది. వెంటనే భర్త మహేశ్కు చెప్పింది. ‘పూల గురించి కాదు, కేసుల గురించి ఆలోచించు’ అన్నాడు. చెల్లెండ్ల సలహా అడిగింది. ‘లాయరమ్మగారు మల్లెపూలు అమ్ముతారట.. ఆ మల్లెపూలమ్మా మల్లేపూలేయ్’ అంటూ వెక్కిరించినట్లు మాట్లాడారు.
శంకరపురం మల్లెలు
అలా, అన్ని వైపుల నుంచీ నిరాశే. దీంతో, ఆన్లైన్లో టెర్రస్ గార్డెనింగ్ గురించి తెలుసుకున్నది. ‘శంకరపుర మల్లిగె’ రకాన్ని ఎంచుకున్నది. మొత్తం 90 మొక్కలను, వంద కుండీలను కొనుగోలు చేసింది. మూడు నెలలు గడిచాయి. మల్లెపంట విరగపండింది. ఈ సీజన్లో ఖర్చు పన్నెండు వేలు. సంపాదన ఎనభై అయిదు వేలు. పట్టుదలతో అనుకున్నది సాధించిన కిరణను బంధువర్గమంతా ఆకాశానికి ఎత్తేస్తున్నది. ‘మా కిరణ మనసు మల్లె’ అంటున్నారు.