చూసే కండ్లుండాలే కానీ, ప్రకృతిలో ప్రతిదీ ఓ కళాఖండమే. కాబట్టే.. బిహార్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్లలోని సంప్రదాయ కళలను ప్రతిబింబిస్తూ ప్రత్యేక దీపాలను తయారు చేయిస్తున్నారు సికింద్రాబాద్ బొల్లారం ప్రాంతానికి చెందిన మేఘన. కలంకారీ, తోలుబొమ్మలాటల్లోని పలు చిత్రాలను ఆయా ప్రాంతాలకు చెందిన కళాకారులతో అందంగా చేయించి ఇంట్లో, ఆఫీసుల్లో వాడే దీపాలను రూపొందిస్తున్నారామె. ‘సరైన గుర్తింపు లభించక చాలా మంది కళాకారులు నగరాలకు వలస వెళ్తున్నారు. అనేక కళలు అంతరించిపోతున్నాయి. వాటిని నేటి పరిస్థితులకు, అవసరాలకు తగినట్టు మలిచే ప్రయత్నమే ఇది. టేకుతో చేసిన స్టాండ్స్కు రకరకాల డిజైన్లను వేసి అందంగా తీర్చిదిద్దుతాం. వీటిని ఎక్కడైనా అలంకరించుకోవచ్చు’ అంటున్నారు మేఘన. ప్రస్తుతం మూడు రాష్ర్టాల కళాకారులు కలిసి ఈ కళాఖండాలను రూపొందిస్తున్నారు. చేర్యాల పెయింటింగ్స్నూ తమ దీపాలతో వెలిగించే ఆలోచనలో ఉన్నారు మేఘన. వీటిని ఆన్లైన్లోనూ అమ్మకానికి పెట్టారు.