ఆడపిల్ల ఎదగాలన్నా, నలుగురిలో తలెత్తుకొని నడవాలన్నా చదువులతోనే సాధ్యమంటున్నది రాజస్థాన్ సిరోహి జిల్లాకు చెందిన 43 ఏండ్ల బసంతీదేవి. పిల్లలతో పాటు, పెద్దలూ చదువుకోవాలన్న నినాదంతో గ్రామాలన్నీ తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నది బసంతీ బహెన్.
పసివయసులోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న బసంతీదేవి అమ్మమ్మ దగ్గరే పెరిగింది. అక్కడే ఐదో తరగతి వరకు చదువుకున్నది. పదమూడేండ్ల వయసులో పెండ్లి చేశారు. భర్త, అత్తమామలు తనను చాలా ప్రోత్సహించేవారు. అప్పట్లో ఐదో తరగతి చదివినవాళ్లను కాంట్రాక్టు టీచర్లుగా నియమించింది ప్రభుత్వం. అలా నెలకు రూ.600 జీతానికి బసంతి టీచర్ ఉద్యోగంలో చేరింది. స్కూల్లో పని చేస్తూనే పదో తరగతి పాసైంది. ఆపైన, దూరవిద్యలో బీఏ పట్టా అందుకున్నది. తోటి ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో బీఎడ్ కూడా చేసి ఉపాధ్యాయురాలికి అవసరమైన అన్ని అర్హతలూ సంపాదించింది. తన భర్తనూ డిగ్రీ చేసేలా ప్రోత్సహించింది బసంతి. ఆయన ప్రస్తుతం అక్కడి పంచాయతీ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నాడు. చదువు విలువ తెలిసిన బసంతి ఆడపిల్లలను బడికి పంపేలా తల్లిదండ్రులను ఒప్పించేది. తను టీచర్గా చేరినప్పుడు, ఆ ఊరి పాఠశాలలో నలుగురే ఆడపిల్లలు. ఇప్పుడు 300 మంది వరకూ చదువుకుంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠాలు చెప్పి, ఆ తర్వాత చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి బాలికా విద్య పట్ల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తుంది బసంతి. ఇప్పటికీ, ఆమె నెల జీతం ఎనిమిదివేలు మాత్రమే. ‘జీతానిదేముంది? జీవితాలను మార్చే అదృష్టం నాకు దక్కింది’ అని సంతోషంగా చెబుతుంది బసంతి.