Huzurabad elections | “నా కొడుకు శీను పట్టుదల మనిషి. తెలంగాణ కోసం లాఠీ దెబ్బలు, బూటు తన్నులు తింటాంటే టీవీలల్ల కండ్ల నిండ చూసిన. పాణం విలవిల్లాడేది. అద్దు బిడ్డా.. అంటే ఇనకపొయ్యేది. మనకు మంచి రోజులస్తయని చెప్పెటోడు. సీఎం కేసీఆర్ సార్ నా కొడుకు కట్టానికి ఇలువిచ్చిండు.గిప్పుడు టికెట్ ఇచ్చిండు. ఊరూరికి తిరిగి ఓట్లు ఏయించుతం. గెలిపించుకుని తీరుతం..”అంటున్నారు హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ( Gellu srinivas yadav ) తల్లి లక్ష్మి.
మా శీను ఇంటికి పెద్ద కొడుకు. వాడు పుట్టినప్పుడు మాకు అన్నీ కష్టాలె. తిందామంటే తిండికి లేదు. గసోంటి పరిస్థితిల కూలీ నాలికి పోయి బతికెటోళ్లం. మా శీనును సుతం కూలికి తీస్కపోదు. ఐదో తరగతిదాక హిమ్మత్నగర్లనే సదివిండు. ఆరో తరగతి నుంచి ఇంటర్ దాకా వీణవంకల సదివిండు. అటెన్క హైదరాబాద్కు వోయి పెద్ద సదువులు సదువుత అంటే పంపించినం. అక్కడ హాస్టళ్ల ఉండి సదువుకున్నడు. తెలంగాణ కొట్లాట మొదలుగాంగనే కేసీఆర్ సార్తోని కలిసి నడిశిండు. ఎక్కడ కొట్లాటైతే అక్కడ మా శీను ఉండెటోడు. ‘గీ కొట్లాటలు, ఉద్యమాలేంది బిడ్డా.. మంచిగ సదువుకో’ అని చెప్పి చూసినం. కానీ, ఇనలే. ‘మనకు మంచి రోజులు వస్తయమ్మా’ అని నమ్మకంగ చెప్పెటోడు. నా కొడుకు పోరాటాలు సూసిన కేసీఆర్ సార్ ఆన్ని ఇంక ఇడువలె. ఎంటేసుకున్నడు. ఆయిన చేయి సుతం మావోడు ఇడువలె. ఇప్పుడు ఇంత దూరమచ్చింది. నా కొడుకు కట్టాన్ని చూసిన సార్, హుజూరాబాద్ టికెట్ ఇచ్చిండు. శానా సంతోషంగున్నది..
ఈటలకు మావోని మీద కండ్లమంట ఎక్కువ. వాడు టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు కాంగనే కండ్లు మండిచ్చుకున్నడు. నా కంటే పెద్దోడు అయితడనుకుంటున్నడని ఆళ్లతోని ఈళ్లతోని అనవట్టిండు. అవన్నీ మాకు ఇనిపించినయ్. నా భర్తను కూడా దూరందూరం పెట్టవట్టిండు. దగ్గరికి రానిచ్చుడు లేదు. జనాల అవసరాల గురించి ఏదన్నా చెప్పితే ఇనుడు లేదు. మేము సుతం ఆయినతోని సాలిచ్చుకున్నం. మా కొడుకు కేసీఆర్సార్తోని మంచిగుండుడు ఈటలకు నచ్చది. ఆయన పైసలు చూసుకుని అట్ల మాట్లాడిండు. నా కొడుకు బానిస కాదు.. బాధ్యతగల మనిషి.
మా శీను చెప్పింది నిజమే. హిమ్మత్నగర్ల మాకు 10 గుంటల భూమి ఉన్నది. నాకు నలుగురు సంతానం. ఎవలది వాళ్లు పంచుకుంటే శీనుకు రెండు గుంటలే వస్తది. మా అత్తా మామ సంపాదించింది రెండెకరాలు ఉండె. అమ్ముకోవల్సి వచ్చింది. రాజకీయాలు కూడా దానికి కారణం.
చెప్తన్నగా.. ఈటల నా భర్తను శానా వాడుకొని వదిలేసిండు. ఆయినకు మండలంల మంచి పేరున్నది. ఓసారి ఎలక్షన్ల నిలబడితే ఎన్ని పైసలుగావాలె.. ఎందుకు నిలవడ్డవని బెదిరిచ్చిండు. మా ఆయిన పైసలు వద్దు, ఏం వద్దని ఈటలకు సపోటు చేసిండు. అప్పటి సంది మా కుటుంబం మొత్తం ఆయనతోనే ఉంటున్నం. రెండు సార్లు గెల్సెదాకా మంచిగనే ఉన్నడు. మూడోసారి ఎమ్మెల్యే అయినంక శానా మారిపోయిండు. అంతకు ముందు ఆయినను మల్లన్న మల్లన్న అని పిలిచెటోడు. ఏడగల్సినా దగ్గరికి తీసుకొని మాట్లాడెటోడు. మూడో ఎలక్షన్ సంది మనిషి మారిపోయిండు. మాతోని మాట్లాడినా మాట్లాడకున్నా ఆయిన కోసం ఎలక్షన్ల తిరిగెటోళ్లం. ఓట్లు ఏయించెటోళ్లం. ఏమంట మా శీను టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడయ్యిండో, మమ్ములను దూరం కొట్టిండు..
మాతోని మస్తుగ చెప్పెటోడు. మంచిగ సదువుకొని ఏదైనా నౌకరి చెయ్యి బిడ్డా అని చెప్పెటోళ్లం. ఎప్పుడు చూసినా ఉద్యమం ఉద్యమం అని పోయెటోడు. ఉద్యమం చేసుకుంట సదువైతే ఆపలే. మస్తు సదివిండు. తెలంగాణ వచ్చేదాకా ఉద్యోగం వద్దు అన్నడు. పెండ్లి గూడ చేసుకోను అన్నడు. శీను ఇంటలేడని మా నడిపి కొడుకు పెండ్లి చేస్తమంటే, దానికి సుతం ఒప్పుకొన్నడు. అన్నిటికీ వాడే ముందటవడి తమ్ముని పెండ్లి చేసిండు. తెలంగాణ అచ్చినంకనే 2014లో మా శీను పెండ్లి చేసినం. కేసీఆర్ సార్, కవితక్క పెండ్లికి వచ్చిండ్రు. వాని పట్టుదల నేను అప్పుడే చూసిన. ఏదన్నా తలుచుకుంటే అయ్యేదాక నిద్రపోడు.
శానా బాధనిపిచ్చేది. ఎవళకు లేని పట్టి మా కొడుక్కు ఎందుకు అనుకునెటోళ్లం. హైదరాబాద్ల ఓసారి పోలీసులు బట్టలు ఇడిపిచ్చి కొట్టిండ్రు. అది టీవీల చూసి మస్తు ఏడ్శిన. 150 కేసులు పెట్టిండ్రు. శానా రోజులు జైళ్లనే ఉన్నడు. పోలీసోళ్లు లాఠీలతోని కొట్టంగ, బూట్లతోని తన్నంగ నా కొడుకు ‘జై తెలంగాణ’ అనుడు మస్తుసార్లు విన్న. ఎన్ని దెబ్బలు తిన్నా, తన్నులు పడ్డా ఎత్తిన జెండా దించలే. ఉద్యమాన్ని ఇడువలే. కేసీఆర్ చేయి వదులలే. అప్పట్ల అన్ని దెబ్బలు తిన్నడు, జైళ్లకు పోయిండు. శీనుకు న్యాయం జరగాల్నని శానా మంది కోరుకునెటోళ్లు. ఇప్పుడు, సరైన న్యాయం జరిగిందని అందరు అంటున్నరు. ఈటల రాజేందర్పై నా బిడ్డ గెలిచి తీరుతడు..
నా కొడుకు పేదింటి బిడ్డ.. చిన్నప్పటి సంది గంజి తాగి.. గట్క తిని బతికినోడు. పేదోళ్ల కష్టాలు ఎట్లుంటయో వానికెరుక. నా అసోంటి పేద తల్లుల కష్టాలు తీరుస్తడు. నాకా నమ్మకం ఉన్నది. రాజకీయాలకు వచ్చి పైసలు సంపాదించుకున్నోళ్లు కొందరు ఉంటే.. ఆస్తులు అమ్ముకున్నోళ్లు సుతం ఉంటరు. మేము ఆస్తులు అమ్ముకున్నం. కూడేసుకోలె. నా కొడుక్కు పైసల మీద ద్యాస లేదు. సంపాయించుకోవల్నన్న ఆలోచన సుతం లేదు. ఉన్నంతల ఎట్ల బతుకాల్నో వానికి నేర్పిచ్చినం. ఈ ఐదు మండలాలల్ల మా శీను గురించి తెల్వనోళ్లు లేరు. కేసీఆర్ సార్ పేరు చెప్పుకొని ఎందరో కోట్లు సంపాయిస్తున్నరు. మా శీనుకు కేసీఆర్ సార్ శానా దగ్గరని చెప్తరు. ఇప్పటిదాక పైస సంపాయించలె. వానికి పైసలు అవుసరంలె. పేదోళ్లకు సేవ చేయాలనుకుంటడు. మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటడు.
నా కొడుకు తప్పక గెలుత్తడు. వాని ఎన్క కేసీఆర్ ఉన్నడు. టీఆర్ఎస్సోళ్లు ఉన్నరు. మేముసుతం కాలికి బట్ట కట్టకుండ తిరుగుతం. ఈ జిల్లాల ఏ పార్టీవోళ్లన్న గొల్లోళ్లకు టికెట్ ఇచ్చిండ్రా? ఇప్పుడు నా కొడుక్కు కేసీఆర్ సార్ ఇచ్చిండు. ఈ ముచ్చటనే ఐదు మండలాలల్ల ఇంటింటికి చెప్తం. ఈసారి ఈటల ఓడిపోవుడు ఖాయం.
… వెంకటస్వామి
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Gellu srinivas yadav | ‘గెల్లు’కు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్న హుజూరాబాద్ ప్రజలు
Harish rao | గెల్లును గెలిపించి.. అభివృద్ధి బాధ్యతను నామీద పెట్టండి: మంత్రి హరీశ్రావు
Huzurabad Elections | గెల్లుకే ఓటేస్తాం.. ఊరంతా ఏకమై టీఆర్ఎస్ పార్టీకి మద్దతు..
etela rajender | Huzurabad Elections | ఈటల రాజేందర్.. నీకు ఓటు ఎందుకు వేయాలి..?