ఏ ఆట చూసినా పురుషులకే అధికప్రాధాన్యం ఇస్తుంటారు. క్రికెట్ వంటి ఆటలో మహిళలను ప్రోత్సహిస్తున్నా.. అంతర్జాతీయస్థాయిలో ప్రాతినిధ్యం, నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఈ సమస్యకు పరిష్కారంగా మహిళా క్రికెట్ క్రీడాకారుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి ఐసీసీ ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దాని ద్వారా భవిష్యత్ టీం లీడర్స్ను తయారు చేయానికి పెద్ద బృందాన్నే ఏర్పాటు చేసుకుంది. అదే ‘100% క్రికెట్ ఫ్యూచర్ లీడర్స్ ప్రోగ్రాం’. ఇందులో మన దేశం నుంచి ఇద్దరు మహిళలకు చోటు దక్కింది. వీరిలో ముంబయికి చెందిన స్పోర్ట్స్ మాజీ జర్నలిస్ట్, రైజ్ వరల్డ్ వైడ్ హెడ్ కంటెంట్ రైటర్ హరిణి రాణా, తమిళనాడుకు చెందిన ఇండియన్ రైల్వేస్ మాజీ క్రీడాకారిణి, మ్యాచ్ రిఫరీ విజయలక్ష్మి నరసింహన్ ఉన్నారు. ఈ లీడర్స్ ప్రోగ్రాంలో చోటు సంపాదించడానికి 45 దేశాల నుంచి 300 మందికి పైగా దరఖాస్తు చేసుకోగా, 29 దేశాల నుంచి 40 మందిని ఎంపిక చేశారు. వీరిలో మన హరిణి, విజయలక్ష్మి ఉన్నారు. వచ్చే ఏడాది జూన్, నవంబర్లలో రెండు బ్యాచ్లుగా ఈ బృందానికి శిక్షణ ఇస్తారు. అనంతరం ఈ క్రికెట్ ఫ్యూచర్ లీడర్స్ బృందం.. క్రికెట్లో మహిళలకు ప్రాతినిధ్యం, కెప్టెన్సీపై శిక్షణ ఇస్తారు. బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా చేసిన హరిణి, సహరా న్యూస్లో, టైమ్స్నౌలో 12 ఏండ్ల పాటు నేషనల్ స్పోర్ట్స్ ఎడిటర్గా పనిచేసింది. ప్రపంచ కప్లు, ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, వింబుల్డన్, ఫ్రెంచ్ఓపెన్స్ వంటి పెద్ద ఈవెంట్లను కవర్ చేసింది. చిన్నప్పుడు టెన్నిస్ బాల్తో క్రికెట్ నేర్చుకొని, ఇండియన్ రైల్వేస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ప్రస్తుతం బీసీసీఐ రిఫరీగా కొనసాగుతున్న విజయలక్ష్మి కూడా తన ఎంపికపట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నది. ‘మనదేశంలో టాలెంట్కు కొదువ లేదు. ఎక్కువ మంది అమ్మాయిలు ఇప్పుడు క్రికెట్ నేర్చుకుంటున్నారు. వారందరికీ అవకాశాలు ఇప్పించడం మా కర్తవ్యం. ఐసీసీ ఇటువంటి ఒక ప్యానెల్ను ఏర్పాటు చేయడం శుభపరిణామం’ అని హరిణి, విజయలక్ష్మి చెబుతున్నారు.