భారతీయ మహిళలకు ప్రత్యేక ఆభరణం మంగళ సూత్రం. కాలానుగుణంగా పుస్తెలతాడు కూడా ఫ్యాషన్ ఆభరణంగా మారింది. తాజాగా ప్రముఖ ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ బల్గరీ మణిమయ ఖచిత మంగళ సూత్రాన్ని మార్కెట్లో విడుదల చేసింది. గత నెలలో ప్రియాంక చోప్రా జోనాస్ను తమ సంస్థ తమ గ్లోబల్ అంబాసిడర్గా ప్రకటించిన వెంటనే ఈ ఆభరణాన్ని విపణిలో విక్రయానికి ఉంచింది. ‘బల్గరీ నెక్లెస్’గా పిలిచే ఈ సూత్రాన్ని 18 క్యారెట్ల బంగారంతో రూపొందించారు. పురాతన రోమన్ నాణేలపై ఉన్న రాతల నమూనాలో సంస్థ పేరును మంగళ సూత్రాలపై ముద్రించారు. గోమేధికాలు, మధ్యలో వజ్రాలను పొదిగిన ఈ ఆభరణం ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో ప్రధాన ఆకర్షణ. ఈ నగను ‘సౌందర్యానికి సమకాలీన వ్యాఖ్య’గా బల్గరీ నిర్వచించింది. సంస్థ వెబ్సైట్ ప్రకారం మంగళ సూత్రం ధర రూ. 3,49,000. వోగ్ ఇండియా తాజా సంచిక ముఖ చిత్రంపై ప్రియాంక చోప్రా ఇదే మంగళ సూత్రాన్ని ధరించడం విశేషం.